Q2 results: అంచనాలకు మించి HCL tech లాభాలు, ఒక్కో షేర్ డివిడెండ్ రూ.4
2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఐటీ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. హెచ్సీఎల్ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. ఈ త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ రూ.3,046 కోట్లుగా అంచనా వేయగా ఏకంగా రూ.3,142 కోట్లు నమోదు చేసింది. అంతకుముందు క్వార్టర్ (జూన్ త్రైమాసికం)లో రూ.2,925 కోట్లు నమోదు చేసింది. త్రైమాసికం ప్రాతిపదికన రూపాయి రెవెన్యూ 4.2 శాతం పెరిగి రూ.17,841 కోట్ల నుండి రూ.18,594 కోట్లకు చేరుకుంది. ఎబిట్ 21.6 శాతంగా నమోదయింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగో త్రైమాసికాల్లో రెవెన్యూ 1.5 శాతం నుండి 2.5 శాతం మధ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఎబిట్ మార్జిన్ అంచనాలు 19.5-20.5% నుండి 20-21%కు పెరగనుందని అంచనా వేస్తోంది. డాలర్ రెవెన్యూ గ్రోత్ 6.4 శాతం మేర పెరిగి 2,507 మిలియన్ డాలర్లుగా నమోదయింది. ఈ కంపెనీ ఇటీవలి సెప్టెంబర్ త్రైమాసికంలో 15 ట్రాన్స్ఫార్మేషనల్ డీల్స్ దక్కించుకుంది.
ఫలితాలకు ముందు హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర 843.70గా పలికింది. అయితే ఆ తర్వాత 825కు దిగి వచ్చింది. ఐటీ కంపెనీలు ముఖ్యంగా హెచ్సీఎల్ టెక్ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. హెచ్సీఎల్ వరుసగా 71వ త్రైమాసికంలో డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్ పైన రూ.4 ఇచ్చింది.