శ్రీలంకలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ అభివృద్ధి కేంద్రం
HCL టెక్నాలజీస్ శ్రీలంకలో తన మొట్టమొదటి సాఫ్టువేర్ అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రం వర్చువల్ సెరామనీ ప్రారంభోత్సవానికి శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స, శ్రీలంకలో ఇండియన్ హైకమిషనర్ గోపాల్ బాగ్లే పాల్గొన్నారు. శ్రీలంకలో ఐటీ రంగం అభివృద్ధికి, స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ కేంద్రం దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు రాజపక్స తెలిపారు.
శ్రీలంకలో ఏర్పాటు చేసిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ కేంద్రంలో 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిన్నర వ్యవధిలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. రానున్న ఐదేళ్లలో 3000 మంది ఉద్యోగులకు చేరుకోనుంది. కొలంబోలోని హెచ్సీఎల్ కార్యాలయంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మల్టీలేయర్డ్ డేటా, ఫిజికల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, హైఎండ్ సిస్టమ్స్ ఉంటాయి.
ప్రస్తుతం కొలంబోలోని ఈ కార్యాలయంలో 650 మందికి పైగా ఉద్యోగుల సీటింగ్ కెపాసిటీ ఉంది. కొలంబోలోని కార్యాలయంలో ఇప్పటికే 100 మందికి పైగా కొత్త లోకల్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. నవంబర్ 2020 నాటికి ఈ కేంద్రంలో మరో 600 సీట్లను పెంచాలని హెచ్సీఎల్ భావిస్తోంది.