GST Meeting: పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే.. రాష్ట్రాలు అంగీకరించేనా?
పెట్రోల్, డీజిల్తో పాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? జీఎస్టీ కౌన్సిల్ దీనిని పరిగణలోకి తీసుకుంటుందా? అనే అంశాలు తేలిపోనున్నాయి. నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనని పరిగణలోకి తీసుకోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పన్నులు విధిస్తున్నాయి. రాష్ట్రాలు తమ వాటా విధించడంతో పాటు కేంద్రం వాటా నుండి కూడా నిధులు వస్తాయి. అయితే వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ప్రజలకు భారీ ఊరట దక్కుతుంది. జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ధరల్లో భారీ మార్పు వస్తుందని నిపుణుల నుండి సామాన్యుల వరకు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తోంది.
సాధరణంగా పెట్రోల్ బేస్ ధర రూ.40 సమీపంలో ఉంది. వ్యాట్, డీలర్ కమిషన్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ఛార్జీలు రూ.60కి పైగా ఉన్నాయి. అంటే అరవై శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. ఈ పన్నుల్లో కొంత మొత్తం కేంద్రానికి, ఇంకొంత మొత్తం రాష్ట్రాలకు చేరుతుంది. పన్నుల వాటా అధికంగా ఉండటంతో పెట్రోల్ సామాన్యుడి వద్దకు చేరుకునేసరికి లీటర్ పైన రూ.100 దాటింది. కొన్నిచోట్ల రూ.110 కూడా ఉంది. ఇక డీజిల్ రూ.100కు చేరువలో ఉంది. డీజిల్ బేస్ ధర కూడా దాదాపు పెట్రోల్ అంతనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాట్ ధరల తేడా ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ కిందకు తెస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే వాదనలు ఉన్నాయి. జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే గరిష్ట స్లాబ్ 28 శాతంగా ఉంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోల్ బేస్ ధర రూ.40 వద్ద 28 శాతం స్లాబ్ ప్రకారం పెట్రోల్ ధర పైన పన్ను వాటా రూ.12 వరకు ఉంటుంది. అప్పుడు పెట్రోల్ ధర రూ.52 వరకు ఉంటుంది. దీనికి డీలర్ కమిషన్ రూ.2 లేదా రూ.3 కలిపితే రూ.55 వరకు చేరుకోవచ్చు. అలాగే డీజిల్ ధర రూ.50కి చేరుకోవచ్చు. అయితే జీఎస్టీ ధరలను సవరించి, దీని పరిధిలోకి తెస్తే మాత్రం రూ.70 నుండి రూ.80 వరకు ఉండవచ్చుననే వాదనలు ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి కేంద్రం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించడం సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువగా వచ్చే ఆదాయం మద్యం, పెట్రోల్ వంటి వాటి నుండే. కాబట్టి ఈ ఆదాయాన్ని కోల్పోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏడాదికి రూ.5 లక్షల కోట్లు వస్తోంది. ఇందులో రాష్ట్రాల వాటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది. కానీ ఇప్పుడు వచ్చే దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు 30 శాతం నుండి 40 శాతం వరకు తగ్గుతాయని, అంత మేర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతున్నందున రాష్ట్రాలు అంగీకరించడం సమస్యగా మారిందని అంటున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు ఉంటాయి. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.35 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఉదాహరణకు ఓ రాష్ట్రంలో వ్యాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ 23.07 శాతం, డీజీల్ పైన 14 శాతం ఉంది. రాష్ట్రాలకు ఈ పన్నులే కాకుండా, కేంద్రం విధించే పన్నుల్లోను వాటా వస్తుంది. కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవడంతో పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయమే అధికం.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారింది ఈ అంశం. ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో బీజేపీ నేత, బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోడీ ప్రతిపక్షాలకు ఓ సవాల్ విసిరారు. జీఎస్టీ కౌన్సిల్లో ప్రతిపక్షాలు ఈ అంశాలు లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో లేని ఇతర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని గుర్తు చేశారు. అసలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి మరో ఎనిమిది నుండి పదేళ్లు పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన డజనుకు పైగా పన్నులను విలీనం చేస్తూ 2017 జూలై 1 నుండి జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF), సహజ వాయువు, ముడి చమురును మాత్రం ఇందులో చేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకివి ప్రధాన పన్ను ఆదాయ వనరులు కావడమే ఇందుకు కారణం. జీఎస్టీ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటున్నాయి.