జీఎస్టీ ఎగవేత 93,000 కోట్లు: సమాచారం హక్కు చట్టం ద్వారా వెల్లడి
2017కు ముందు సెంట్రల్ ఎక్స్చైజ్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ను కలుపుకొని రూ.93,375 కోట్ల మేర జీఎస్టీ ఎగవేతను ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది. ఢిల్లీ, ముంబై, పుణే, అహ్మదాబాద్, చండీగడ్ తదితర నగరాలతో పాటు దేశంలోని వివిధ పెద్ద నగరాలలో ఈ మేరకు అక్రమాలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) ఇటీవల ఆర్టీఐ ద్వారా వెల్లడించింది.
అంతకుముందు ఢిల్లీ DGGI ప్రధాన కార్యాలయం ద్వారా గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.9359 కోట్ల పన్ను ఎగవేత నివేదించబడింది. 2011 మరియు 2021 ఆర్థిక సంవత్సరాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తోన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వివిధ పన్ను ఎగవేతదారులకు పంపిన నోటీసులు 7,000 కాగా, వీటి ద్వారా రూ.93,375 కోట్ల ఎగవేత వెలుగులోకి వచ్చింది.
ఈ మొత్తం రికవరీ కాలేదని ఆర్టీఐ కార్యకర్త అభయ్ కొల్లార్లార్ సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న సమాచారాన్ని బట్టి వెల్లడవుతోంది. పన్ను ఎగవేతలను అరికట్టడంలో డీజీజీఐ విఫలమైందని, అలాగే డిఫాల్టర్ల పైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఈ పదేళ్ల పన్ను ఎగవేతలకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు.