భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్ళు, వరుసగా రెండు నెలలు అంతకంతకూ డౌన్
కరోనా మహమ్మారి కారణంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లపై భారీగానే ప్రభావం పడుతోంది. ఆగస్ట్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.86,449 కోట్లకు పరిమితమైంది. జూలై నెలలోని రూ.87,422 కోట్ల కంటే తక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఇదే ఆగస్ట్ నెలతో చూసుకుంటే 88 శాతం జీఎస్టీ వసూళ్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆగస్ట్ 2019లో రూ.98,202 కోట్లు వసూళయ్యాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే 2020 జూలైలో 86 శాతం వసూళ్లు ఉన్నాయి. కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా జీఎస్టీ కలెక్షన్లపై ప్రభావం పడుతోన్న విషయం తెలిసిందే.
జీడీపీ అంటే ఏమిటి, ఎలా లెక్కిస్తారు? కీలకరంగాలు సరే.. అసలు 'లెక్క'కాదు!
జీఎస్టీ కలెక్షన్లు ిలా...
ఆగస్ట్ నెలలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.15,906 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.21,064 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.42,264 కోట్లు (రూ.19,179 కోట్లు కలుపుకొని), సెస్ రూపంలో రూ.7,215 కోట్లు సమకూరాయి. ఇందులో సీజీఎస్టీ కింద రూ.18,216 కోట్ల చెల్లింపులు జరిపింది కేంద్రం. ఎస్జీఎస్టీ కింద రూ.14,650 కోట్లు చెల్లించింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో రూ.19,179 కోట్లు దిగుమతి వస్తువుల ద్వారా సమకూరింది. గరిష్ట జీఎస్టీ 28 శాతానికి అదనంగా విధించే సెస్ రూపంలో మరో రూ.7,215 కోట్ల వసూళ్లు ఉన్నాయి.
సెటిల్మెంట్ అనంతరం..
రెగ్యులర్ స్టేట్మెంట్ అనంతరం ఆగస్ట్ మాసంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన రాబడి వరుసగా సీజీఎస్టీ రూ.34,122 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.35,714 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల వాటా 77 శాతం, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ రెవెన్యూ (ఇంపోర్ట్ సర్వీస్తో కలిపి) 92 శాతంగా ఉంది.
జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో కనిష్టానికి పడిపోయాయి. ఏప్రిల్లో రూ.37,172 కోట్లు, మే నెలలో రూ.62,151 కోట్లు, జూన్ మాసంలో రూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్ట్లో రూ.86,449 కోట్లుగా ఉంది. 2019 మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్) జీఎస్టీ కలెక్షన్లతో పోలిస్తే ఈ ఏడాది 59 శాతానికి పరిమితమయ్యాయి. జూన్ నెలలో రూ.90వేల కోట్లు ఉండగా, ఆ నెలతో పోలిస్తే జూలై, ఆగస్ట్లో తగ్గాయి.
జీఎస్టీ కోసం..
జీఎస్టీ కలెక్షన్లు భారీగా తగ్గడంతో కేంద్రం కూడా రాష్ట్రాలకి ప్రత్యామ్నాయాలను చూపించింది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్రం ఆదుకోవడానికి బదులు భారం వేయడం సరికాదని బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు అంటున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు కేంద్రానికి కూడా తగ్గుతాయి. కేంద్రం వద్ద కూడా రెవెన్యూ కొరత ఉంటుంది. పైగా కరోనా కారణంగా పెద్ద ఎత్తున ఖర్చులు అవుతున్నాయి. కేంద్రం కూడా ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటోంది.