ఉద్యోగులకు మోడీ బంపరాఫర్! 5 ఏళ్లు కాదు.. త్వరలో ఏడాదికే గ్రాట్యుటీ!?
న్యూఢిల్లీ: తమ సంస్థకు లేదా కంపెనీకి సేవలు అందించినందుకు గాను ఓ కంపెనీ... ఉద్యోగికి ఇచ్చే అదనపు అమౌంట్ గ్రాట్యుటీ. ఏదేని కంపెనీలో 5 ఏళ్ల పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవలు అందిస్తే అలాంటి ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇస్తారు. కంపెనీకి సుదీర్ఘంగా సేవలు అందించినందుకు గాను యజమాని ఇచ్చే ప్రోత్సాహకంగా దీనిని చెప్పవచ్చు. గ్రాట్యుటీ విషయంలో మోడీ ప్రభుత్వం ఉద్యోగులు సంతోషించే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.
పీఎం కిసాన్ నిధి పడిందా, లేదంటే ఇలా చెక్ చేసుకోండి
5 ఏళ్ల నుంచి ఏడాదికి గ్రాట్యుటీ కుదింపు...
ఒక సంస్థలో లేదా కంపెనీలో అయిదేళ్ల పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవలు అందిస్తే ప్రస్తుతం గ్రాట్యుటీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు గ్రాట్యుటీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చే ఆలోచన చేస్తోందట. ఇప్పటి వరకు గ్రాట్యుటీ రావాలంటే ఓ సంస్థలో అయిదేళ్లు పని చేయాలి. కానీ దీనిని ఏడాదికి కుదించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
బిల్లుపై డ్రాఫ్ట్ కోడ్
రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ బిల్లును తీసుకురానున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ బిల్లుపై డ్రాఫ్ట్ కోడ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గ్రాట్యుటీ సర్వీస్ అర్హతను ఏడాదికి తగ్గించాలని చాలాకాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా స్పందించి, దీనిని పరిగణలోకి తీసుకున్నదని అంటున్నారు.
గ్రాట్యుటీ ఎలా ఇస్తారు?
ఒక సంస్థలో అయిదేళ్ల పాటు పని చేసిన అనంతరం 26 రోజులను పని దినాలుగా పరిగణలోకి తీసుకొని సంవత్సరానికి 15 రోజుల చొప్పున గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఉద్యోగం చేసిన సంవత్సరాల ఆధారంగా గ్రాట్యుటీ వస్తుంది.
ఉద్యోగి సర్వీస్ను ఇలా లెక్కిస్తారు..
గ్రాట్యుటీ లెక్కించే సమయంలో ఉద్యోగ సర్వీస్ ఆరు నెలల కంటే ఎక్కువగా ఉన్నా అది సంవత్సరంగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాల తర్వాత మరో ఏడెనిమిది నెలలు పని చేస్తే దానిని ఆరు సంవత్సరాలకు లెక్కిస్తారు. కంపెనీకి 6 వర్కింగ్ డేస్ ఉంటే ఉద్యోగి సంవత్సరానికి కనీసం 240 రోజులు పని చేయాలి. ఒకవేళ కంపెనీకి 5 రోజులు వర్కింగ్ డేస్ అయితే 190 రోజులు పని చేయాలి.
సోషల్ సెక్యూరిటీ డ్రాఫ్ట్ కోడ్
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ఇటీవల కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2019 డ్రాఫ్టును సిద్ధం చేసింది. దీనిపై ప్రజల నుంచి, స్టేక్ హోల్డర్స్ నుంచి అభిప్రాయాలు సేకరించింది. దీనిపై సలహాలు, స్వీకరణలు అక్టోబర్ 25వ తేదీకి తుది గడువు ఇచ్చారు. ఈ గడువులోగా ఎంతోమంది స్పందించారు.
గ్రాట్యుటీ ఇలా..
- ఓ సంస్థకు అయిదేళ్ల పాటు సేవలు అందించినందుకు గాను ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లిస్తారు.
- ఉద్యోగి ఓ సంస్థలో 5 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తి చేసి రిటైర్మెంట్ తీసుకున్నా లేదా రాజీనామా చేసినా గ్రాట్యుటీ వస్తుంది.
- ఉద్యోగి పని చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే గ్రాట్యుటీ ఇస్తారు.
- శాశ్వత వైకల్యానికి గురైనా గ్రాట్యుటీ వస్తుంది.
- స్థిర కాల ఉపాధి కింద కాంట్రాక్ట్ వ్యవధి ముగిసినప్పుడు
- కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంఘటన.