పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం ఆదాయం 79% జంప్
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన కలెక్షన్స్ 33 శాతం పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం కరోనా ముందుస్థాయి కంటే 79 శాతం అధికం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(CGA) వద్ద ఉన్న ఏప్రిల్-సెప్టెంబర్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గత ఏడాది ఎక్సైజ్ డ్యూటీని పెంచిన విషయం తెలిసిందే. దీనికి తోడు అంతర్జాతీయంగా ఇటీవల ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ రూ.110, రూ.100 క్రాస్ చేసాయి.
గత ఏడాది తొలి అర్ధభాగంలో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న ఎక్సైజ్ సుంకం వసూళ్లు ఈసారి రూ.1.71 లక్షల కోట్లకు పెరిగాయి. కరోనా వెలుగులోకి రావడానికి ముందు 2019, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఇవి రూ.95,930 కోట్లుగా నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే 79 శాతం పెరుగుదల. ఎక్సైజ్ సుంకం పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా 2020-21లో రూ.3.89 లక్షల కోట్లు, 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.
జీఎస్టీ అమలులోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజవాయువుపై మాత్రమే ఎక్సైజ్ సుంకం ఉంటోంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో అదనంగా రూ.42,931 కోట్లు వసూలు అయ్యాయి. ఈ ఏడాది మొత్తంలో ఆయిల్ బాండ్స్కు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కలిసి వచ్చి ఇంధన డిమాండ్ పెరుగుతోంది. దీంతో పెట్రోల్, డీజిల్ పైన విధించే ఎక్సైజ్ సుంకం ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.