పెట్రోల్పై ఎక్సైజ్ ఆదాయం రెండింతలు, రూ.3.7 లక్షల కోట్లు
పెట్రోల్, డీజిల్ పైన సుంకం ద్వారా 20220-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఎంతో తెలుసా? FY21లో ఈ సుంకాల ద్వారా వచ్చిన మొత్తం రూ.3.7 లక్షల కోట్లు. అంటే ఏడాదిలో దాదాపు రెండింతల ఆదాయం వచ్చింది. రాష్ట్రాల వాటా కింద రూ.20 వేల కోట్లు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మంగళవారం ఈ విషయాలు వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ సుంకాల ద్వారా వచ్చిన మొత్తం రూ.1.78 లక్షల కోట్లు. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండింతల కంటే ఎక్కువగా వచ్చింది.
సుంకం భారీగా పెరిగి, ఆ తర్వాత తగ్గి..
కరోనా సమయంలో పన్నులు పెరగడం వసూళ్ల పెరుగుదలపై ప్రభావం చూపింది. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో FY21లో ఆదాయం రెండింతలు అయిందని కేంద్రమంత్రి తెలిపారు. 2019లో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ పైన రూ.19.88గా, డీజిల్ పైన రూ.15.83గా ఉండేది. దీనిని గత ఏడాది రెండు విడతల్లో లీటర్ పెట్రోల్ పైన రూ.32.38కి, డీజిల్ పైన రూ.31.83కి పెంచారు. తిరిగి గత బడ్జెట్లో దీనిని వరుసగా రూ.32.90కి, రూ.31.80కి సవరించారు. రిటైల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం గత నెల ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్ పైన రూ.5, లీటర్ డీజిల్ పైన రూ.10 తగ్గించడంతో ఈ సుంకం పెట్రోల్ పైన రూ.27.90, డీజిల్ పైన రూ.21.80కి తగ్గింది.
రాష్ట్రాలకు వాటా బేసిక్ పైన..
రాష్ట్రాలకు బేసిక్ ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయంలో వాటా ఉంటుంది. ప్రస్తుతం ఈ సుంకం లీటర్ పెట్రోల్ పైన రూ.1.40గా ఉంది. పెట్రోల్ పైన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద రూ.11, రోడ్డు మౌలిక వసతుల సెస్ కింద రూ.13, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ కింద రూ.2.50 వసూలు చేస్తున్నారు. డీజిల్ పైన బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ.1.80గా ఉంది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద రూ.8, రోడ్డు మౌలిక వసతుల సెస్ కింద రూ.4తో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ను విధిస్తున్నారు. అయితే, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేవలం బేసిక్ ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది.
కేంద్రానికి.. రాష్ట్రాలకు
2016-17లో ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.2.22 లక్షల కోట్లు, 2017-18లో రూ.2.25 లక్షల కోట్లు, 2018-19లో రూ.2.13 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ సుంకానికి అదనంగా రాష్ట్రాలు వ్యాట్ విధిస్తాయి. ఏప్రిల్ 2016-మార్చి 2021 మధ్య వివిధ రాష్ట్రాలకు వ్యాట్ ద్వారా రూ.9.57 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని మంత్రి తెలిపారు. ఈ అయిదేళ్ల కాలంలో కేంద్రానికి రూ.12.11 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.