ఓలా, ఉబెర్లకు కళ్లెం: క్యాబ్ డ్రైవర్లకు మోడీ ప్రభుత్వం శుభవార్త, కానీ!
న్యూఢిల్లీ: ఓలా, ఉబెర్ వంటి యాప్ ఆధారిత ట్యాక్సీ ఆపరేటర్లు డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్లకు కళ్లెం వేసేందుకు కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. ట్యాక్సీ ఆపరేటర్ల కోసం డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్తో పాటు ఇతర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలుస్తోంది. ఇది డ్రైవర్లకు గుడ్ న్యూస్. అయితే పరిశ్రమకు మాత్రం ఇది అంతగా రుచించేది కాదని అంటున్నారు.
ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం శుభవార్త?
20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
సహజసిద్ధ మార్కెట్ ధోరణుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా వాటి వల్ల కలిగే హానీ ఎక్కువగా ఉంటుందనే వాదన, భయం కూడా ఉంటుంది. ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ యాప్ బేస్డ్ ఆపరేటర్ల డ్రైవర్ ఛార్జీలు సాధారణంగా 20 శాతం వరకు ఉంటాయి. అయితే వీటిని పది శాతానికి పరిమితం చేయాలని రవాణా శాఖ ఆలోచన చేస్తోంది.
కంపెనీల ఆందోళన
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే క్యాబ్ అగ్రిగేటర్లపై ఆర్థికభారం పడుతుందని అంటున్నారు. ఓలా, ఉబెర్ క్యాబ్స్ డ్రైవర్లకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు తక్కువ చార్జీలు వసూలు చేస్తూ పోటీ పడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఈ చర్యలు తాము ఎదుర్కొంటున్న నష్టాలు మరింతగా పెరుగుతాయని ఆ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
త్వరలో ప్రజల ముందుకు...
ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీ త్వరలో ముందుకు వస్తుందని ట్రాన్సుపోర్ట్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారట. ఈ డ్రాఫ్ట్పై ప్రజల అభిప్రాయం తీసుకుంటారని చెబుతున్నారు. దీనిపై ఫీడ్ బ్యాక్ కోసం వచ్చే వారం ప్రజల ముందుకు రావొచ్చునని అంటున్నారు.