చైనా హువావే టెక్నాలజీకి దూరం, 5G ట్రయల్స్కు పచ్చజెండా
5G టెలికం సేవలకు టెల్కోలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు పరీక్షలు నిర్వహించడానికి జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఎంటీఎన్ఎల్ కంపెనీల దరఖాస్తులను టెలికం డిపార్టుమెంట్ ఆమోదించింది. కంపెనీలు ప్రయోగాత్మకంగా పరీక్షల ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ఇందుకు అవసరమైన స్పెక్ట్రం బ్యాండ్స్ను కూడా ప్రకటించింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఇందుకు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్ వంటి టెక్నాలజీ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ట్రయల్స్ నిర్వహించనుంది.
చైనా కంపెనీలకు నో
టెల్కోలు ఏవీ కూడా చైనా కంపెనీల సాంకేతికతను వినియోగించడం లేదు. టెలికం డిపార్టుమెంట్ ఆమోదం లభించిన టెలికాం గేర్ తయారీ కంపెనీల్లో ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్, రిలయన్స్ జియోలు ఉన్నాయి. గతంలో స్పెక్ట్రం వేలం తర్వాత పరీక్షలు జరిగేవని, ఇపుడు తొలుత పరీక్షల నిర్వహణకు అనుమతులిచ్చామని, దీంతో 5G స్పెక్ట్రం వేలానికి, నెట్వర్క్ సేవల ప్రారంభానికి మధ్య కాలాన్ని తగ్గించినట్లు అవుతుందని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ అన్నారు. మరోవైపు, BSNL విడిగా పరీక్షలు నిర్వహిస్తుందని, దాని దరఖాస్తు త్వరలో వస్తుందన్నారు.
ముందు ఇలా.. ఆ తర్వాత
మొదట ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు చైనా కంపెనీ హువావే టెక్నాలజీని వినియోగించి పరీక్షలు నిర్వహించేందుకు దరఖాస్తు చేశాయి. ఆ తర్వాత చైనా కంపెనీల జోక్యం లేకుండానే పరీక్షలు చేపడతామని దరఖాస్తు ఇచ్చాయి. టెలికం డిపార్టుమెంట్ కూడా చైనా దిగ్గజాల సాంకేతికతకు దూరంగా ఉన్నాయి.
ఆరు నెలల పాటు సమయం
టెల్కోలు 5G పరీక్షల కోసం వివిధ స్పెక్ట్రంలను వినియోగిస్తాయి. వస్తువుల సమీకరణ, ఏర్పాటు సహా ఆరు నెలల పాటు ఈ పరీక్షలు నిర్వహించుకోవచ్చు. టెలికం డిపార్టుమెంట్ ప్రకారం 4Gతో పోలిస్తే 5G టెక్నాలజీ వల్ల పది రెట్ల డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుంది. స్పెక్ట్రం సామర్థ్యం మూడింతలు అవుతుంది.