ఐటీఆర్ దాఖలు గడువు ఈ నెలాఖరు వరకు, ఊరట కల్పించిన సీబీడీటీ
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 అసెస్మెంట్ ఇయర్) గాను ఆలస్యమైన, సవరించిన ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) శనివారం పొడిగించింది. ఈ నెల 31వ తేదీ లోగా ఈ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని స్పష్టం చేసింది.
కరోనా సెకండ్ వేవ్ భారీ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో పన్ను కంప్లయెన్స్కు సంబంధించి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. 2020-21 అసెస్మెంట్ ఏడాదికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్స్, సబ్ సెక్షన్(4) కింద లేట్ రిటర్న్స్ను ఈ ఏడాది మార్చి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉండగా ఆ గడువు తేదీని మే 31 వరకు పొడిగించినట్లు తెలిపింది.
వివాదాల పరిష్కార కమిటీ(DRP)కి సమర్పించవలసిన అభ్యంతరాలు సహా కమిషనర్కు దాఖలు చేయాల్సిన ఫైలింగ్స్ గడువు తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు వెల్లడించింది.