BSNL disinvestment: బీఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణ లేదు
టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL)ను ప్రయివేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి తెలిపారు. లోకసభకు ఒక లిఖితపూర్వక ప్రశ్నకు బుధవారం సమాధానమిస్తూ 2020లో సంస్థ ఉద్యోగులకు ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(VRS) కారణంగా BSNL అందించే సర్వీసుల్లో ఎలాంటి లోపం, జాప్యం ఉండటం లేదన్నారు. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సంస్థ కార్యకలాపాలకు సరిపోయేంతగా ఉందని చెప్పారు. బీఎస్ఎన్ఎల్కు ఉన్న భవనాలు, స్థలాలు, టవర్స్, టెలికం పరికరాలు, టెలికమేతర పరికరాలు తదితర స్థిరాస్తుల వ్యాల్యూ 2021 మార్చి 31వ తేదీ నాటికి రూ.89,878 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.
దేశీయ మొబైల్ సబ్స్క్రైబర్లలో బీఎస్ఎన్ఎల్ వాటా 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి 9.90 శాతమని, వైర్డ్ బ్రాడ్ బ్యాండు చందాదారుల్లో 15.45 శాతం వాటా ఉన్నట్లు తెలిపారు. వీఆర్ఎస్ అమలు, 4జీ సర్వీసులకు బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిధులు లభించడం, రుణం తగ్గించుకోవడానికి, మూలధన వ్యయాన్ని సమకూర్చుకోవడానికి కొన్ని ఆస్తులను విక్రయించడం, సావరీన్ గ్యారెంటీ బాండ్స్ ద్వారా సమీకరించిన నిధులతో రుణాలను పునర్ వ్యవస్థీకరించడం వంటి చర్యల ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించగలదన్నారు.
విశాఖ ఉక్కుగా ప్రాచుర్య పొందిన ఆర్ఐఎన్ఎల్లో ప్రభుత్వ వాటాను విక్రయిస్తే ఆ సంస్థకు మంచిదని కేంద్రం తెలిపింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆ కంపెనీలోకి తాజా మూలధనం వస్తుందని, సామర్థ్యం విస్తరిస్తుందని, టెక్నాలజీ, మెరుగైన యాజమాన్య నిర్వహణా పద్దతులు వస్తాయన్నారు. గత పదేళ్లుగా ఈ సంస్థ లాభాల్ని పెంచుకోలేకపోతోందని, నష్టాలు రూ.7,122 కోట్లకు పేరుకున్నట్లు తెలిపారు.