కరోనా ఎఫెక్ట్: ఇంటి వద్దకే బ్యాంకు సేవలు, PSU బ్యాంకుల జట్టు
కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకులు కస్టమర్లకు డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకులు కస్టమర్ల ముంగిటకు సేవలు తీసుకు వచ్చేందుకు చేతులు కలిపాయి. ఈ మేరకు PSB అలయెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే పేరుతో ముందుకు వస్తున్నాయి. ఈ కంపెనీ కస్టమర్ల ఇళ్ల వద్దకే బ్యాంకింగ్ సేవలు తీసుకు వెళ్లేందుకు పన్నెండు ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) కింద బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ సేవలను వినియోగించుకుంటుంది.
కొత్త కంపెనీకి ఎస్బీఐ మాజి సీజీఎం, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంక్ డిప్యూటీ సీఈవో రాజేందర్ మిరాఖర్ సీఈవోగా నియమితులయ్యారు. గతంలో పలు PSU బ్యాంకులు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించేవి. ఇప్పుడు తక్కువ వ్యయంతో తమ సంస్ధ కరస్పాండెంట్స్ సేవల్ని అన్ని PSU బ్యాంకులు ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.
ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా చెక్ పికప్, అకౌంట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్, పే-ఆర్డర్స్ డెలివరీ తదితర 11 ఆర్థికేతర సేవలు అందుబాటులో ఉన్నాయి. నగదు ఉపసంహరణ సదుపాయాన్ని కస్టమర్ల ఇంటి ముంగిటకు తీసుకురానున్నారు. PSU కస్టమర్లు తమ ఇంటి ముందే బ్యాంకింగ్ సేవలను పొందేందుకు వెబ్, మొబైల్ యాప్స్తో పాటు ఫోన్ ద్వారా రిక్వెస్ట్ పంపవచ్చు.