7th Pay Commission: ఉద్యోగులకు డీఏ హైక్ తర్వాత మరో బంపర్ బొనాంజా
డీఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న DAను 17 శాతం నుండి 28 శాతానికి పెంచింది. డీఏ పెంపు జూలై 1వ తేదీ నుండి అమలులోకి వస్తోంది. ఈ డీఏ పెంపు ద్వారా 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్(HRA)ను కూడా పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని వచ్చే నెల అంటే ఆగస్ట్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది.
పెరిగిన HRA రేట్లను 2021 ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం HRA పెంపు ఉంటుంది. HRA పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ఎక్స్ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి పెంపు 27 శాతం, వై కేటగిరీ నివాసితులకు 18 శాతం, జెడ్ కేటగిరీ నివాసితులకు 9 శాతం HRA పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, HRA రేట్లు వరుసగా 30%, 20%, 10% కు సవరిస్తారు.
50 లక్షలకు పైగా జనాభా ఉన్న X కేటగీరిగా, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే Y కేటగిరీ, ఐదు లక్షల కంటే తక్కువ మంది ఉంటే Z కేటగిరీ కిందకు వస్తారు. డీఏ పెంపు విషయానికి వస్తే ఇప్పటి వరకు మూడు ఇన్స్టాల్మెంట్ల పెండింగ్లో ఉంది. 2020 జనవరి 1వ తేదీ నుండి జూన్ 30 2020 వరకు నాలుగు శాతం, 2020 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు 3 శాతం, 2021 జనవరి 1 నుండి 2021 జూన్ 30 వరకు 4 శాతం పెండింగ్లో ఉంది. ఈ మూడు డీఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదం ఉద్యోగులకు భారీ ఊరట కలిగించే అంశం.