గూగుల్కు వర్క్ ఫ్రమ్ హోం వల్ల రూ.7500 కోట్లు ఆదాయం మిగులు
కరోనా కారణంగా ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు ప్రయాణ సమయం తప్పింది. కుటుంబంతో అధిక సమయం గడిపేందుకు అవకాశం ఏర్పడింది. ఈ కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కంపెనీ యాజమాన్యాలకు ప్రయోజనకరంగా మారింది. మేనేజ్మెంట్కు కూడా ఖర్చు తగ్గింది. కచ్చితంగా కార్యాలయాలు ఉన్న కంపెనీలు కూడా ఖర్చును తగ్గించుకునే క్రమంలో కార్యాలయాల సంఖ్యను తగ్గించాయి. కార్యాలయాల ఖర్చులు తగ్గడం వల్ల కంపెనీలకు ఆదాయం మిగులుతోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తమకు ఏడాది కాలంలో దాదాపు 100 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు గూగుల్ వెల్లడించింది. భారత కరెన్సీలో ఇది రూ.7500 కోట్లు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి) కాలంలో కంపెనీ ప్రచారం, ఉద్యోగుల ప్రయాణాలు, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేసినట్లు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తెలిపింది. ఈ లెక్కన ఏడాది పొడుగునా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగితే, కంపెనీకి ఖర్చు 100 కోట్ల డాలర్లకు పైగా తగ్గే అవకాశముంది.
గత ఏడాదిలో అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ కోసం ఖర్చు 140 కోట్ల డాలర్లు తగ్గిందని ఆల్ఫాబెట్ తెలిపింది. ఖర్చు తగ్గించుకోవడం, వాయిదా వేయడంతో పాటు కేవలం డిజిటల్ మీడియాలోనే ప్రచారం చేయడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ప్రయాణ, వినోద వ్యయాలనూ 37.1 కోట్ల డాలర్ల మేర తగ్గించుకున్నట్లు వెల్లడించింది.