30 లోన్ యాప్స్కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
ముంబై: ఆన్లైన్ రుణాల పేరుతో రుణగ్రహీతలను వేధిస్తున్న యాప్స్ పైన గూగుల్ ఇండియా చర్యలు చేపట్టింది. పలు యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనంతరం గూగుల్ చర్యలు చేపట్టింది. ఆన్లైన్ ద్వారా రుణాలు అందిస్తున్న మొబైల్ యాప్స్, అధిక వడ్డీలో వేధిస్తుండటంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. వీటిని నిరోధించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్కాయిన్ పేమెంట్స్
అడ్డుకట్టకు వర్కింగ్ గ్రూప్
డిజిటల్ రుణ సంస్థలపై అధ్యయనం కోసం ఓ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది ఆర్బీఐ. ఈ సంస్థలపై చేపట్టాల్సిన నియంత్రణ చర్యలతోపాటు డిజిటల్ రుణ వితరణను సక్రమరీతిలో అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల్ని ఈ వర్కింగ్ గ్రూప్ సూచిస్తుంది. డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆర్థిక రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయడం స్వాగతనీయమేనని, దీంతో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయని, దీనిని సమన్వయం చేసి వినియోగదారుల భద్రతతో పాటు డాటా భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు, విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని, ఇందుకు తగినట్లు నియమ నిబంధనలను రూపొందించాలని ఆర్బీఐ రెండు రోజుల క్రితం ఓ ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ రుణ మొబైల్ ప్లాట్ఫామ్స్ను నిరోధించేందుకే వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
30 యాప్స్ తొలగింపు
ఆర్బీఐ జోక్యం నేపథ్యంలో తాజాగా గూగుల్ ఇండియా కూడా చర్యలు చేపట్టింది. పలు యాప్స్ను ప్లేస్టోర్ నుండి తొలగించింది. ప్లే స్టోర్లో ఉన్న వివిధ లోన్ యాప్స్ పైన రివ్యూ చేసిన గూగుల్ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ హెచ్చరికలు, రివ్యూల అనంతరం 30 యాప్స్ స్థానిక చట్టాలను, యూజర్ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. దీంతో ఆ యాప్స్ పైన నిషేధం విధించింది. ఇందుకు అనుగుణంగా వాటిని ప్లే స్టోర్ నుండి తొలగించింది.
నోటీసులిచ్చాం
తొలగించబడిన యాప్స్లో లేజీ పే, క్యాష్ గురు, టెన్ మినిట్స్ లోన్, రూపీ క్లిక్, ఫైనాన్స్ బుద్ధ వంటి వివిధ యాప్స్ ఉన్నాయి. కొన్ని లోన్ యాప్స్ యూజర్ సేఫ్టీ పాలసీలను ఉల్లంఘించినట్లు గుర్తించి వెంటనే ప్లే స్టోర్ నుండి తొలగించామని, మరిన్ని యాప్స్ డెవలపర్లకు వివరణ కోసం నోటీసులు ఇచ్చామని, వివరణ రాకుంటే ప్లేస్టోర్ నుండి తొలగిస్తామని గూగుల్ ఇండియా తెలిపింది.