LIC IPO: ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే వార్త.. స్టాక్ ధర పడిపోతుందని ఆందోళన వద్దు.. ఎందుకంటే..
LIC IPO: దేశంలోని ప్రభుత్వరంగానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో అనగానే సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ షేర్ల కోసం క్యూ కట్టారు. ఇది ఐపీవోకి ముందు మాట. కానీ లిస్టింగ్ తరువాత షేర్ చాలా పేలవంగా తన పనితీరును కనబరిచింది. ఈ క్రమంలో అనేక మంది ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. అరె ఎందుకు ఇందులో పెట్టుబడులు పెట్టాం అని చింతించిన వారు చూలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి వారికి పెద్ద ఊరటనిచ్చే వార్త ఇక్కడ ఉంది.
యాంకర్ ఇన్వెస్టర్లు..
ఇంతకీ ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. యాంకర్ ఇన్వెస్టర్లు మాత్రం ఎల్ఐసీ షేర్లలో పెట్టుబడులను వదలడం లేదు. ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద ఐపీవోను తీసుకొచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్లకు ఈ వార్త చాలా కీలకమైనది. భారీ నష్టాలు వచ్చనప్పటికీ యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీపై తమ నమ్మకాన్ని కోల్పోలేదు. వారు ఎల్ఐసీని విడిచిపెట్టలేదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ పెట్టుబడులను అలాగే కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఎల్ఐసీ షేర్ ధర..
రూ.949 లకు కంపెనీ నిర్ణయించిన అప్పర్ ప్రైస్ బ్యాండ్కు స్టాక్ను యాంకర్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. కానీ.. స్టాక్ మార్కెట్లో ఈ IPO ప్రయాణం అందరినీ నిరాశ పరిచింది. ఇది మాత్రమే కాదు.. లిస్టింగ్ నుంచి ఎల్ఐసీ షేర్ల ధరలో నిరంతర క్షీణత కొనసాగుతోంది.. తాజా.. ధరను పరిశీలిస్తే, దాని షేర్లు ఇప్పటివరకు 24 శాతం పతనమయ్యాయని తెలుస్తోంది. అయితే బుధవారం ఎల్ఐసీ షేర్ ధర స్వల్ప పెరుగుదల తరువాత రూ.718.30 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
లాక్-ఇన్ పీరియడ్ ముగిసినా..
ఐపీవో ప్రారంభానికి ఒక రోజు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల కోసం షేర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఇన్వెస్టర్లకు కంపెనీ 5.93 కోట్ల షేర్లను జారీ చేసి రూ.5,627 కోట్లను సమీకరించింది. 15 మ్యూచువల్ ఫండ్స్ LICలో పెట్టుబడి పెట్టాయి. అతిపెద్ద నష్టాలను చవిచూసిన తర్వాత కూడా, యాంకర్ ఇన్వెస్టర్ల విశ్వాసం కంపెనీపై అలాగే ఉంది. జూన్లో లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత.. మెుత్తం 15లో ఏడు కంపెనీలు ఎల్ఐసీ షేర్లలో పెట్టుబడిని కొనసాగిస్తుండగా.., మరో రెండు ఫండ్ కంపెనీలు మాత్రం పెట్టుబడిని పెంచాయి.
ఎల్ఐసీ షేర్లను అమ్మేయాలా..?
అంటే ఎల్ఐసీ పెట్టుబడులు రానున్న కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందవద్దని, పెట్టుబడులను అలాగే కొనసాగించవచ్చని వారు అంటున్నారు.