Steel Prices: ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన స్టీల్ ధరలు.. టన్నుకు ఎంత తగ్గిందంటే..
Steel Prices: ఇల్లు కట్టుకోవాలనుకోవటం అనేది చాలా మందికి తమ జీవితకాలంలో ఉండే అతిపెద్ద కోరిక. అయితే ప్రస్తుత ద్రవ్యోల్బణం సమయంలో అన్నింటి ధరలు పెరిగి భారంగా మారాయి. అయితే ఈ సమయంలో స్టీల్ ధరలు భారీగా తగ్గటం సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకునేవారికి కలిసివస్తోంది.
గత నాలుగు నెలలుగా..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాలను తలకిందులు చేసింది. దాని కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం సామాన్యులతో పాటు వ్యాపారవేత్తలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా తర్వాత పుంజుకుంటున్న రియల్టీ రంగానికి ఇది పెద్ద దెబ్బగా మారింది. అయితే గడచిన నాలుగు నెలలుగా నిర్మాణాలకు అవసరమైన ఉక్కు ధరలు టన్నుకు రూ.20వేలు తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని కొంతమేరకు కట్టడి చేసే చర్యలు సత్ఫలితాలనిచ్చాయని చర్చలు మెుదలయ్యాయి.
గతంలో ఊహించినట్లే..
నిపుణులు నాలుగైదు నెలల కిందట టన్ను ఉక్కు రూ.60 వేల స్థాయికి చేరుకుంటుందని వేసిన అంచనాలు నిజం అయ్యాయి. మార్చి నెలలో టన్ను ధర ఆల్ టైమ్ గరిష్ఠమైన రూ.85 వేల దగ్గరగా చేరుకుంది. కానీ ఇప్పుడు దాదాపు రూ.20 వేలు తగ్గి రూ.65 వేలకు చేరింది. ఈ తగ్గుదల మరికొంత కాలం కొనసాగవచ్చని తెలుస్తోంది.
అసలు రేట్లు ఎందుకు తగ్గాయి..?
కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఎగుమతులపై పన్నును పెంచింది. ఎగుమతి సుంకం ఉక్కు విదేశాలకు వెళ్లడం మరింత ఖరీదైనదిగా మారింది. ఇది కాకుండా కొన్ని ఉక్కు ఉత్పత్తిదారులు కూడా ఎగుమతులను తగ్గించారు. ఉక్కుకు డిమాండ్ తక్కువగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దీపావళి నాటికి..
దీపావళి నాటికి నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల నుంచి డిమాండ్ పుంజుకుని స్టీల్కు డిమాండ్ పెరుగుతుందని స్టీల్ గ్రూప్ కో-డైరెక్టర్ నితిన్ కాబ్రా అన్నారు. డిమాండ్ తగ్గటంతో పాటు ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయని ఆయన అన్నారు. మరికొద్ది నెలల వరకు ఉక్కు ధరల్లో ఎలాంటి తగ్గింపు ఉండదని చెబుతున్నారు. కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు.
ఎగుమతులు..
కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని పెంచడం వల్ల భారత వాటా తగ్గింది. చాలా మంది పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నారు. కేంద్రం నుంచి ఎగుమతి సుంకం తగ్గింపు ప్రకటన వస్తుందని వారు భావిస్తున్నారు. దీపావళి తర్వాత ఉక్కు పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.