భారీగా పెరుగుతున్న పసిడి ధరలు: బంగారం@2,000 డాలర్లు, మన వద్ద సరికొత్త రికార్డు
బంగారం ధరలు రోజుకో సరికొత్త గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ ప్రకారం ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల 1.67 శాతం ఎగబాకి రూ.54,612 పలికింది. వెండి ఫ్యూచర్స్ 6.41 శాతం ఎగిసి కిలో రూ.69,962 పలికింది. కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా దేశయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుండి 30 శాతం వరకు ఎగిశాయి.
వివిధ నగరాల్లో బంగారం
నిన్న ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.52,450, 24 క్యారెట్ల పసిడి రూ.53,750 పలికింది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.52,080, 24 క్యారెట్లు రూ.56,810, ముంబైలో 22 క్యారెట్లు రూ.52,300, 24 క్యారెట్లు పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 24 గ్రాముల పసిడి రూ.200కు పైగా పెరిగి రూ.56,810 పలికింది. ఇది ఆల్ టైమ్ గరిష్టం. 22 క్యారెట్ల పసిడి రూ.52,080 పలికింది. స్పాట్ వెండి ధర స్వల్పంగా తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో రికార్డ్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఔన్స్ పసిడి ధర 0.65 శాతం పెరిగి 2,021 డాలర్లు పలికింది. వెండి 0.05 శాతం ఎగిసి 26.01 డాలర్లకు చేరుకుంది. డాలర్ వ్యాల్యూ, ద్రవ్యోల్భణం, గ్లోబల్ పసిడి మార్కెట్ ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్ వంటి వివిధ అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
దీపావళి నాటికి కుదురుకుంటుందా
కరోనా వల్ల చేతిలో నగదు ఇబ్బందులకు తోడు భారీగా పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెనుకాడే పరిస్థితికి కారణంగా మారాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా ధరలు రోజురోజుకు పెరగడమే. ఇప్పుడు పండుగ సీజన్, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల నేపథ్యంలో రిటైలర్లు డిమాండ్ పెరుగుతుందేమోనని ఆశిస్తున్నారు. కానీ పరిస్థితులు ఇలాగే ఉంటే దీపావళి సమయానికి కూడా బంగారం డిమాండ్ పుంజుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.