లాక్డౌన్ ఎత్తివేత: బంగారం ర్యాలీ కొనసాగేనా? కీలక సమయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి
కరోనా మహమ్మారి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ నెలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.2,259 వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ.2,950 వరకు పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీన రూ.43,474గా ఉన్న ధర నెల రోజులు తిరిగేసరికి ఏప్రిల్ 30వ తేదీన 45,733 పలికింది. మిడిల్ ఏప్రిల్లో బంగారం ధర రూ.47,000కు చేరుకోవడం ద్వారా గరిష్ట రికార్డును అందుకుంది.
భారీగా తగ్గిన బంగారం డిమాండ్, కారణాలివే: కస్టమ్స్, ట్యాక్స్ మినహాయించి 25% పెరుగుదల
బంగారం భవిష్యత్తుపై ఆందోళన
బంగారం ధరలు ఈ ఏడాది దీపావళి నాటికి రూ.52,000కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో జూన్ కామెక్స్ పసిడి గురువారం 19.20 డాలర్లు లేదా 1.12 శాతం తగ్గి రూ.1,694 వద్ద ట్రేడ్ అయింది. జనవరి-మార్చి క్వార్టర్లో మన దేశంలో బంగారం డిమాండ్ 36 శాతం క్షీణించింది. ఇందులో మార్చిలో క్షీణించిందే చాలా ఎక్కువ. కరోనా కారణంగా బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించి ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ అదే సమయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళనతో కొంతమంది తగ్గుతున్నారు.
ఇన్వెస్టర్లు ఆచితూచి
దీర్ఘకాలంలో బంగారంపై పెట్టుబడి మంచిదే. కానీ సమీప భవిష్యత్తులో ఈ ఏడాది చివరి నాటికి రూ.52,000, వచ్చే ఏడాది చివరి నాటికి రూ.82,000కు చేరుకుంటుందని అంచనాలు వస్తున్నాయి. అయినప్పటికీ లాక్ డౌన్, హఠాత్తుగా ధర పెరగడం వంటి వివిధ కారణాలతో బంగారం కొనుగోళ్లు గత మూడు నెలల్లో తగ్గిపోయాయి. ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
కరోనా ప్రభావం తగ్గుముఖం
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా కొంత తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో మృతుల సంఖ్య తగ్గుతోంది. ఇటలీ ఈ వారంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వనుంది. ట్రంప్ కూడా అవే సంకేతాలు ఇచ్చారు. లాక్ డౌన్ లేదా రిస్ట్రిక్షన్స్ మినహాయింపు సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేత సమయంలో బంగారం ర్యాలీ అంతగా ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే అది తాత్కాలికమే కావొచ్చు.