బంగారం ధరలపై డాలర్ ప్రభావం, హైదరాబాద్లో ఎంత ఉందంటే?
బంగారం ధరలు గతవారం గతవారం హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. చివరకు బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి చివరి సెషన్లో రూ.47,345 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.692 పెరిగి రూ.69,184 వద్ద ముగిసింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ దాదాపు రూ.9000 తక్కువగా ఉంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నుండి బంగారం ధరలు అంతకంతకూ పెరిగిన విషయం తెలిసిందే. ఆగస్ట్ నెలలో గరిష్టాన్ని తాకిన పసిడి, రష్యా వ్యాక్సీన్ ప్రకటనతో తగ్గముఖం పట్టింది.
గతవారం ధరలు ఇలా...
గతవారం బంగారం ధరలు హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోను పడిపోయాయి. గతవారం ఓ సమయంలో రూ.46,500 స్థాయికి పడిపోయి ఎనిమిది నెలల కనిష్టాన్ని తాకింది. శుక్రవారం తగ్గిన ధరలు, అంతకుముందు రోజు (గురువారం) స్వల్పంగా పెరిగాయి. రూ.47,500 పైన క్లోజ్ అయ్యాయి. సోమవారం నాడు రూ.47,000కు దగ్గర ప్రారంభమయ్యాయి. గతవారం వెండి ధరలు ఓ సమయంలో రూ.71000ను దాటాయి. ఆ తర్వాత రూ.69,000 స్థాయిలో ముగిసింది.
డాలర్ ప్రభావం
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు గతవారం ప్రధానంగా 1800 నుండి 1850 డాలర్ల మధ్య కదలాడాయి. ఇటీవలి కాలంలో డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడుతోంది. ఈ ప్రభావం బంగారంపై పడి, ఒత్తిడి తగ్గింది. అందుకే ఓ స్థాయిలో పసిడి 1780 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 1800 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. అయితే ఇప్పటికీ 1850 డాలర్లకు దిగువనే ఉంది.
హైదరాబాద్లో పసిడి ధర
హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో పసిడి ధరలు ఇటీవల దిగి వచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.500కు పైగా తగ్గి, రూ.48,290కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.500 తగ్గి రూ.44,250కు క్షీణించింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి రూ.1100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ మందగించింది.