అక్షయ తృతీయ రోజు దారుణంగా పడిపోయిన బంగారం అమ్మకాలు
కరోనా మహమ్మారి వరుసగా రెండో సంవత్సరం అక్షయ తృతీయ రోజున పసిడి అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా సేల్స్ తగ్గాయి. ఈసారి కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్, కరోనా ఆంక్షల నేపథ్యంలో పసిడి మార్కెట్ నిరాశపరిచింది. కరోనాకు ముందున్న 2019 అమ్మకాలతో పోలిస్తే శుక్రవారం ముగిసిన అక్షయ తృతీయ అమ్మకాలు 10 శాతం కూడా లేవని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ లేని సమయమైన ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య కొన్నిచోట్ల కొన్ని దుకాణాలు తెరిచినా కొనుగోలుదారులు లేక బోసిపోయాయి.
దుకాణాలు తెరిచినా..
కరోనాతో ప్రజల కొనుగోలుశక్తి పడిపోవడంతో ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున పసిడి అమ్మకాలపై ప్రభావం పడింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే కొద్దిస్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కొన్ని దుకాణాలు తెరిచినప్పటికీ కరోనా భయంతో బయటకు రావడానికి చాలామంది ఆసక్తి చూపలేదు. అక్షయ తృతీయ రోజు కచ్చితంగా కొనుగోలు చేయాలనుకున్న వారిలో చాలామంది ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేశారు. ఇక దుకాణాలు కూడా పరిమిత సమయం మాత్రమే తెరుచుకున్నాయి.
భారీగా పడిపోయిన సేల్స్
సాధారణంగా అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా దాదాపు 30 టన్నుల పసిడి సేల్స్ ఉంటాయి. ఈసారి ఒక టన్ను సేల్ కూడా లేదు. ముంబై, ఢిల్లీ, పుణేతో పాటు బంగారం అధికంగా కొనుగోలు చేసే రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఆఫ్లైన్ సేల్స్ భారీగా పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం తెలిపారు. గత ఏడాది కరోనా అనుభవం నేపథ్యంలో వర్తకులు ఆన్లైన్ విక్రయాల పైన దృష్టి సారించారు.
ఈసారి ఎంత ఉండవచ్చునంటే
90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉందని, ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు ఏమాత్రం లేవని చెప్పారు. అక్షయ తృతీయ రోజున జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్ ద్వారా జరిగాయన్నారు. గత ఏడాది 2.5 టన్నులు పసిడి విక్రయం జరగగా, ఈసారి 3 నుండి 4 టన్నులు మాత్రమే ఉందన్నారు. దుకాణాలు తెరిచిన ప్రాంతాల్లో 10 శాతం నుండి 15 శాతం సేల్స్ జరిగే అవకాశముందని వర్తకులు అంచనా వేస్తున్నారని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ తెలిపారు. ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున ఒక టన్ను నుండి ఒకటిన్నర టన్ను వరకు విక్రయాలు ఉండవచ్చునని ఇండియా బులియన్, జ్యువెల్లర్స్ అసోసియేషన్ డైరెక్టర్ గాడ్గిల్ వెల్లడించారు.