Gold rate today: భారీగా పెరిగిన బంగారం ధరలు, మళ్లీ రూ.51,000 క్రాస్
బంగారం ధరలు నేడు (మే 5, గురువారం) భారీగా పెరిగాయి. క్రితం సెషన్ వరకు తగ్గిన పసిడి ధరలు రూ.50,500 స్థాయికి చేరుకున్నాయి. అక్షయ తృతీయకు ముందు రోజు భారీగా తగ్గి కొనుగోలుదారులకు సాంత్వన కలిగించాయి. అయితే అక్షయ తృతీయ అనంతరం తిరిగి పెరుగుదల నమోదవుతోంది. పసిడి ధరలు నేడు పెరిగాయి.
ఎంసీఎక్స్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం గం.12 సమయానికి రూ.566 పెరిగి రూ.51,176 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.633 పెరిగి రూ.51,500 వద్ద ట్రేడ్ అయింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఒక శాతానికి పైగా పెరిగాయి. సిల్వర్ ఫ్యూచర్స్ భారీగానే పెరిగాయి. అక్షయ తృతీయ పర్వదినం రోజున 62,000 స్థాయిలో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.64,000 స్థాయికి చేరుకున్నాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1757 పెరిగి రూ.63,871 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1728 పెరిగి రూ.64,533 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో 1875 డాలర్లకు దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1900 డాలర్లను తాకాయి. ఈ రోజు ఒక్కరోజే గోల్డ్ ఫ్యూచర్స్ 32 డాలర్లకు పైగా పెరిగాయి. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 32.08 డాలర్లు లేదా 1.72 శాతం ఎగిసి 1900.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.798 డాలర్లు లేదా 3.56 శాతం ఎగిసి 23.200 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.