ఆ దెబ్బతో మళ్లీ పెరిగిన బంగారం ధర, తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే?
బంగారం ధరలు నేడు (శుక్రవారం మే, 29) పెరిగాయి. గత నాలుగైదు రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు హాంగ్కాంగ్ అంశానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా వైరస్ కేసులు పెరుగడం వంటి వివిధ కారణాల వల్ల పైపైకి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్ అస్థిరత, చమురు ధరలు ఇంకా 30 డాలర్లకు ఎగువ మాత్రమే ఉండటంతో సురక్షిత పెట్టుబడిగా బంగారంవైపు చూస్తున్నారు.
అక్కడ జపాన్ ప్యాకేజీ ఎఫెక్ట్! ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధరలు
ఎంసీఎక్స్లో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.33 శాతం లేదా రూ.152 ఎగిసి రూ.46,557 పలికింది. సిల్వర్ కిలో 0.34 శాతం లేదా రూ.167 పెరిగి రూ.48,725 పలికింది. గోల్డ్ ఫ్యూచర్స్ జూన్ ఈ నెల ప్రారంభంలో రూ.45556 పలికింది. ఆ తర్వాత 15వ తేదీన రూ.47360 ఎగిసి, ఆ తర్వాత నుండి కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రూ.46,550 కంటే పైకి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం ఎగిసి ఔన్స్ 1,719.63 పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి 1,734.60 డాలర్లు పలికింది. ఇతర అతి విలువైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్ 1,930.67 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. వెండి ఔన్స్ 0.9 శాతం తగ్గి 830.81 డాలర్ల వద్ద, వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ 17.38 డాలర్లు పలికింది.
అస్థిరంగా బంగారం ధరలు
ట్రాయ్ ఔన్స్ (ఔన్స్ కంటే 2.75 గ్రాములు ఎక్కువ) బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో గత కొద్ది రోజులుగా 1,800 డాలర్ల దిశగా వెళ్లి, మళ్లీ తగ్గుతోంది. ఇలా మూడుసార్లు ఈ సమీపానికి చేరుకున్నది. ఆ తర్వాత 1700 డాలర్లకు అటు ఇటుగా కదలాడుతోంది. మొత్తానికి అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ పరిణామాలు, కరోనా, ఈక్విటీ మార్కెట్, చమురు మార్కెట్ వంటి అంశాలు బంగారం ధరలు అస్థిరంగా ఉంచేలా చేస్తున్నాయి. భారీగా పెరుగుతూ, అంతలోనే కాస్త తగ్గుతున్నాయి. మళ్లీ పెరుగుదల నమోదవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
ఈ రోజు ఉదయం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.44,3100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.48,500 పలుకుతోంది.