శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.40,000 దిగువకు
బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు క్యాపిటల్ రూపంలో దాచుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో మార్కెట్లు కుప్పకూలడంతో పాటు పసిడి వంటి అతి ఖరీదైన లోహాల ధరలు కూడా దిగి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రూ.45వేల సమీపంలో ఉన్న బంగారం ఇప్పుడు ఏకంగా రూ.40వేల దిగువకు వచ్చింది.
కరోనా ఎఫెక్ట్: కొనాలా వద్దా.. బంగారం కొనుగోలుపై గందరగోళం
రూ.40,000 లోపుకు తగ్గిన
గత వారం రోజులుగా తగ్గుతున్న బంగారం ధర బుధవారం స్వల్పంగా రూ.311 పెరిగింది. దీంతో రూ.40,241కి చేరుకుంది. ఈ రోజు ఈ ధర రూ.40,000కు దిగువకు చేరుకుంది. ఆయా నగరాన్ని బట్టి రూ.39,000, రూ.38,000కు పైగా ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.26 శాతం తగ్గి రూ.39,223గా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 0.45 శాతం తగ్గి రూ.34,060గా ఉంది.
నిన్నటితో పోలిస్తే..
ఎంసీఎక్స్లో ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాముల పసిడికి బుధవారం రూ.39,723 వద్ద క్లోజ్ అయింది. గురువారం ఉదయం రూ.39,307 వద్ద ఓపెన్ అయింది. మధ్యాహ్నం గం.12.15 సమయానికి కాస్త పెరిగి రూ.39835 వద్ద ఉంది. మొత్తానికి ధర మాత్రం రూ.40,000 కంటే దిగువన ఉంది.
తగ్గిన ధరలు
బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.920 తగ్గి రూ.42,300గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.920 తగ్గి రూ.38,700గా ఉంది. గురువారం కూడా స్వల్పంగా తగ్గాయి.
పది రోజుల్లో 14 శాతం తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1 శాతం తగ్గింది. మార్చి 9వ తేదీన ఔన్స్ 1,703 డాలర్లుగా ఉన్న బంగారం మార్చి 19 నాటికి 1,464 డాలర్లకు పడిపోయింది. అంటే ఈ పది రోజుల్లో 14 శాతం పడిపోయింది.
ఈ రేంజ్లో ఉండే అవకాశం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 1450 నుండి 1532 డాలర్ల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని, ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ.38,300 నుండి రూ.40,400 మధ్య ఉండవచ్చునని, అలాగే కిలో వెండి రూ.32,500 నుండి రూ.35,800 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
25 రోజుల్లో ఇలా..
బంగారం ధర గత ఇరవై ఐదు రోజుల్లో దాదాపు రూ.42వేల నుండి రూ.45వేలకు చేరుకొని ఆ తర్వాత ఇప్పుడు రూ.40వేల దిగువకు పడిపోయాయి. ఉదాహరణకు అహ్మదాబాద్లో గత నెల 25న (ఫిబ్రవరి ) స్పాట్ గోల్డ్ ధర రూ.42,717 ఉండగా, ప్యూచర్స్ రూ.42,794గా ఉంది. ఆ తర్వాత మార్చి 6న స్పాట్ గోల్డ్ రూ.44,315, ప్యూచర్స్ రూ.44,229గా ఉంది. ఇప్పుడు స్పాడ్ గోల్డ్ రూ.40,618, ఫ్యూచర్స్ రూ.39,800గా ఉంది.