ఆర్థిక వ్యవస్థలు ఆందోళనకరం: బంగారంపై కరోనా ఒత్తిడి, పెరుగుతున్న ధరలు
బంగారం ధరలు ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 30) పెరిగాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఓ వైపు ఈక్విటీ మార్కెట్ క్రమంగా కోలుకుంటున్నప్పటికీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
డాలర్ మారకంతో రూపాయి అదుర్స్, కారణాలివే! మళ్లీ బలహీనపడుతుందా?
బంగారం ధర పెరుగుదల
ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.43 శాతం లేదా రూ.198 పెరిగి రూ.45,744 పలికింది. వెండి కిలో 0.49 శాతం లేదా రూ.209 పెరిగి రూ.42,571 పలికింది. కరోనా మహమ్మారి కారణంగా స్పాట్ గోల్డ్ మార్కెట్ మూసివేసి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.1 శాతం పెరిగి 1,708.85 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పెరిగి 1,725 డాలర్లుగా ఉంది.
బంగారంపై ఒత్తిడి
రెండో క్వార్టర్లోను వృద్ధి రేటు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పెడ్ అంచనా వేసిన నేపథ్యంలో ఎంసీఎక్స్ బంగారం పాజిటివ్గా స్పందించింది. రాబోయే రోజుల్లో నిరుద్యోగం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది ఫెడ్. కరోనా ప్రభావం తీవ్రంగానే ఉండటంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. చమురు ధరలు కూడా కనిష్టంగానే కొనసాగుతున్నాయి.
ఇతర ఖరీదైన లోహాలు
ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్ ధర 0.6 శాతం పెరిగి 1,947.94 వద్ద, ప్లాటినమ్ 0.2 శాతం పెరిగి 776.32, వెండి 0.8 శాతం తగ్గి 15.24 డాలర్లు పలికింది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి ఆరు నెలల నుండి ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది.