ప్యాకేజీ నుండి డాలర్ వరకు... భారీగా తగ్గి అంతలోనే పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు నేడు (జూన్ 4, గురువారం) పెరిగాయి. ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.25 శాతం లేదా రూ.116 పెరిగి రూ.46,124 పలికింది. అంతకుముందు రెండు సెషన్లలో బంగారం ధరలు రూ.1,100 పడిపోయాయి. వెండి ధరలు కిలో రూ.48,452 ఫ్లాట్గా ఉంది. అంతకుముందు రెండు సేషన్లలో ఈ ధర రూ.2,000 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్ ధర 1,703.67 డాలర్లు పలికింది. వెండి ధర మాత్రం 0.4 శాతం పడిపోయి 17.59 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1,704.90 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇప్పటికే బంగారం 'జీరో', చమురు ధరలు ఇలాగే ఉంటే రూపాయికి ప్లస్
ఢిల్లీ, హైదరాబాద్లో స్పాట్ గోల్డ్
ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.47,884 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.400 పెరిగి రూ.49,170 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.400 పెరిగి రూ.45,070 పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 రోజుల క్రితం రూ.49,000కు పైన ఉంది. ఇప్పుడు కూడా దాదాపు అంతే ఉంది. పది రోజులుగా రూ.48,800 నుండి రూ.49,220 మధ్య తచ్చాడుతోంది.
బంగారం ధరలు పెరగడానికి కారణం
అమెరికా - చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల నుండి మరిన్ని కరోనా ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలు బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. జూన్ 16వ తేదీ నుండి చైనా విమానాలు రాకుండా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ECB) ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉంది. 839 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.
ప్యాకేజీ ప్రకటిస్తే బంగారంపై ప్రభావం ఎలా
కరోనా మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తే ఈ ప్రభావం బంగారంపై పడుతుంది. ఉద్దీపనల కారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి. రుణ వడ్డీ రేట్లు తగ్గినా, డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గినా కస్టమర్లకు ప్రయోజనం. అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు వడ్డీయేతర బంగారం వంటి విలువైన లోహాలపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు.
బలహీన అమెరికా డాలర్
బంగారం ధరలు పెరగడానికి అమెరి డాలర్ ప్రభావం కూడా ఉంది. ఇటీవల ఇతర కరెన్సీలతో బంగారం ధర తగ్గి, మార్చి కనిష్టానికి పడిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ఆందోళనలు ఉన్నాయని, దీంతో సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ వద్ద బుధవారం బంగారం నిల్వలు 0.4 శాతం పెరిగి 1,133.37 టన్నులకు చేరుకుంది.