పెరిగిన బంగారం ధర: షాకింగ్.. 3 ఏళ్లలో రూ.లక్ష నుండి రూ.1,30,000?
బంగారం ధరలు ఈ రోజు (జూన్ 30, మంగళవారం) అతి స్వల్పంగా పెరిగాయి. ఓ విధంగా దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఉదయం గం.9.30 సమయానికి 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్లో 0.07% పెరిగి రూ.48,280 పలికింది. కిలో వెండి ధర 0.34 శాతం పెరిగి రూ.49,151కి చేరుకుంది. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా దాటాయి. రెండోసారి విజృంభనపై స్పష్టత రావడం లేదు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో బంగారం దాదాపు స్థిరంగా ఉంది.
రికార్డ్స్థాయికి బంగారం ధరలు, 8 ఏళ్ల గరిష్టానికి సమీపంలో..: పసిడిపై మంచి రిటర్న్స్
గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన ధర
ఎంసీఎక్స్లో గత వారం బంగారం ధర రూ.48,589 పలికింది. ఈ రికార్డ్ ధరతో పోలిస్తే రూ.250 నుండి రూ.300 మాత్రమే తక్కువగా ఉంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 1,781.20 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ట్రాయ్ ఔన్స్ ధర 18.06 వద్ద క్లోజ్ అయింది. గ్లోబల్ మార్కెట్లోను స్వల్ప పెరుగుదలనే నమోదు చేశాయి. కరోనా కేసుల కారణంగా పెట్టుబడులతో పాటు రూపాయి ప్రభావం కూడా బంగారంపై ఉంటుంది. గత వారం డాలర్ మారకంతో రూపాయి 75.50కి చేరుకుంది.
హైదరాబాద్లో బంగారం ధర
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.46,450కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,660 పలికింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. వెండి కూడా స్వల్పంగా పెరిగి కిలో రూ.48,500 పలికింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.47,250, 24 క్యారెట్ల బంగారం రూ.48,450కి చేరుకుంది.
రూ.1,30,000 దాటేనా?
బంగారం ధరలు మరో మూడేళ్లలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 3,000 డాలర్ల నుండి 5,000 డాలర్లకు, వెండి ఔన్స్ 50 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు కరోనా వంటి కారణంగా బంగారం వంటి అతి ఖరీదైన లోహాలపై ఒత్తిడి పడుతోంది. దీంతో ఇటీవల పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే ఔన్స్ బంగారం 3000 నుండి 5000 డాలర్లు చేరే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఆ లెక్కన మన వద్ద రూ.1,00,000 నుండి రూ.1,30,000 పైకి అన్నమాట.