అమెరికాXఇరాన్: ఏకంగా రూ.2,000.. భారీగా పెరిగిన బంగారం ధర, పరిస్థితి ఇలాగే ఉంటే
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. మంగళవారం కాస్త మార్కెట్లు కుదురుకున్నప్పటికీ అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఈ దాడుల్లో 80 మంది మృతి చెందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. రెండు దేశాల అడుగులు యుద్ధం దిశగానే కనిపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వైపు చూస్తున్నారు.
అమెరికా - ఇరాన్ టెన్షన్: మార్కెట్, చమురు, బంగారంపై ప్రభావం
మంగళవారం బంగారం ధర దిగి వచ్చింది కానీ..
బంగారం ధరలు రెండు రోజుల క్రితం వరకు భారీగా పెరిగాయి. అయితే మంగళవారం కాస్త తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల ధరలు కాస్త తగ్గడంతో భారత్లోను కొద్దిగా దిగి వచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.420 తగ్గి రూ.41,210 వద్ద నిలిచింది. వెండి ధర పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి స్పందన తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.830 తగ్గి రూ.48,600కి దిగి వచ్చింది.
భారీగా పెరిగాయి
సోమవారం బంగారం రికార్డ్ స్థాయి రూ.41,630, వెండి రూ.49,430 పలికింది. రూపాయి బలోపేతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒత్తిడికి గురి కావడంతో పడిపోయాయి. ఈ నెల 15వ తేదీ తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. అప్పుడు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మంగళవారం న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,568 డాలర్లు, వెండి 18.19 డాలర్లగా ఉంది. అయితే అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకోవడంతో బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.
అక్కడ 1,613 డాలర్లకు పెరిగిన పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో ఫిబ్రవరి ఫ్యూచర్ బంగారం 1,613.30 డాలర్లకు చేరుకుంది. మంగళవారం రెగ్యులర్ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఉన్న ధర కంటే ఇది 39 డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇందుకు ప్రధానంగా జియోపొలిటికల్ టెన్షన్స్ కారణం కావడం గమనార్హం.
4 రోజుల్లో రూ.2,000 పెరిగిన బంగారం ధర
బుధవారం ఎంసీఎక్స్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ 10 గ్రాములు 1.5 శాతం లేదా రూ.615 పెరిగి రూ.41,278కి చేరుకుంది. వెండి 1.4 శాతం లేదా రూ.700 పెరిగి రూ.48,785కు చేరుకుంది. బంగారం ధర గడిచిన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.2,000 పెరిగింది. అమెరికా - ఇరాన్ మధ్య పరిస్థితి ఇలాగే ఉంటే బంగారం ధర మరింత పెరగవచ్చునని అంటున్నారు. 2020లో బంగారం ధర రూ.45వేలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. కానీ ఇదే పరిస్థితి అయితే కొద్ది రోజుల్లోనే ఆ మార్క్కు చేరవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్లాడియం ఆల్ టైమ్ హై
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 1,600 డాలర్లు దాడి ఏడెనిమిదేళ్ల గరిష్టానికి చేరుకుంది. స్పాట్ గోల్డ్ ధర 2 శాతం పెరిగి 1,610.90 డాలర్లుగా ఉంది. మరో విలువైన లోహం పల్లాడియం ఔన్స్ 2,056.01 డాలర్లకు చేరుకొని ఆల్ టైమ్ హైకి చేరుకుంది.