గోల్డ్ షాక్: ఆల్టైం గరిష్టానికి.. భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు నేడు పెరిగి, రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కాలంలోనే 25 శాతం వరకు పెరిగాయి. ఏడాదిలో 35 శాతం నుండి 40 శాతం మధ్య పెరిగాయి. ఇప్పుడు వివిధ కారణాలతో ఈ రోజు మళ్లీ గరిష్టానికి చేరుకున్నాయి.
టిక్టాక్ బ్యాన్, గంటకు లక్షల్లో దూసుకెళ్లిన చింగారీ: చైనాకు రూ.వందల కోట్ల నష్టం
రికార్డ్ స్థాయికి బంగారం ధర
ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్)లో ఉదయం గం.9.30 సమయానికి 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి రూ.48,982కు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.8 శాతం ఎగిసి కిలో రూ.50,779 పలికింది. ఎంసీఎక్స్లో గత వారం బంగారం ధరలు రూ.48,500 పైకి చేరుకున్నాయి. ఇది గరిష్టం. ఇప్పుడు దానిని దాటి రికార్డ్ స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా రూ.50వేలు దాటింది.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,782.21 డాలర్లు పలికింది. 2012 అక్టోబర్ నెలలో బంగారం ధర 1,785.46 పలికింది. ఇప్పుడు దానికి దగ్గరలో ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.7 శాతం పెరిగి 822.50 డాలర్లు, వెడి 0.6 శాతం పెరిగి 18.24 డాలర్లుగా ఉంది.
రూ.50వేలు దాటిన బంగారం
ఇప్పటికే బయట బంగారం ధర 10 గ్రాములు రూ.50వేలు దాటింది. పరిస్థితులు ఇలాగే ఉంటే దీపావళి నాటికి రూ.52వేలు చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో రూ.50,500 దాటింది. బంగారం ధరకు తోడు 2.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది.