మళ్ళీ.. భారీగా తగ్గిన బంగారం ధరలు: రికార్డ్ ధర తర్వాత ఎందుకిలా
బంగారం ధరలు గురువారం (మే 28) స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్లో ఉదయం గం.9.30 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.25 శాతం తగ్గి రూ.46,416 పలికింది. బంగారం ధర గత నాలుగు రోజుల్లో మూడు రోజులు తగ్గుదలను నమోదు చేసింది. నిన్న తొలుత తగ్గినప్పటికీ, ఆ తర్వాత 0.27 శాతం పెరిగింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ ఎంసీఎక్స్లో 0.2 శాతం తగ్గి కిలో రూ.48,310 పలికింది. అంతకుముందు సెషన్లో 1.2 శాతం పెరిగింది.
మహిళల్లో మార్పు: స్థోమత ఉన్నప్పటికీ 37% మంది వద్ద బంగారం లేదు
తెలుగు రాష్ట్రాల్లో ధరలు
బహిరంగ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.900కు పైగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రామలు రూ.48,090కి పడిపోయింది. రెండు రోజుల క్రితం రూ.49కు పైగా ఉంది. ఢిల్లీలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా పతనమైంది.
బంగారంపై వీటి ప్రభావం
దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకు నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు కరోనా కారణంగా మార్కెట్ ఆటుపోటులతో పాటు హాంగ్ కాంగ్ సెక్యూరిటీ లాపై అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు కూడా కారణమవుతున్నాయి.
రికార్డ్ ధర తర్వాత అస్థిరత
ఈ నెల ప్రారంభంలో బంగారం ధరలు ఓ సమయంలో రూ.47,980తో రికార్డ్ ధరకు చేరుకున్నాయి. అప్పటి నుండి బంగారం ధరల్లో మరింత అస్థిరత కొనసాగుతోంది. కరోనా వైరస్ తగ్గుదల, పెరుగుదల, వ్యాక్సిన్ అభివృద్ధి, ఈక్విటీ మార్కెట్ హెచ్చుతగ్గులు వంటి పలు ప్రభావాలతో అస్థిరంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తుండటంతో దేశంలో చాలాచోట్ల జ్యువెల్లరీ షాప్స్ తెరుచుకున్నాయి. కరోనా - లాక్ డౌన్కు తోడు భారీగా ధరలు పెరగడంతో ఇటీవలి కాలంలో బంగారానికి డిమాండ్ తగ్గింది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.2% పెరిగి 1,711.35 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్లో ధర రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. వివిధ దేశాలు ప్రకటించిన ఉద్దీపన చర్యలు బంగారం డిమాండ్ పైన ప్రభావం చూపింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వచ్చేసరికి ప్లాటిమ్ 1.9 శాతం పెరిగి 834.19 డాలర్లు, వెండి 0.4% తగ్గి 17.24 పలికింది.