బలపడిన డాలర్.. భారీగా తగ్గిన బంగారం ధర: ఎంత తగ్గిందంటే?
బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. వరుసగా పెరుగుతున్న అతివిలువైన లోహాల ధరలు నేడు (ఆగస్ట్ 11, మంగళవారం) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.63 శాతం తగ్గి 10 గ్రాములు రూ.54,600 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 1 శాతం తగ్గి రూ.74,700 పలికింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తుండటంతో గత నాలుగు నెలల కాలంలోనే రూ.15వేల నుండి రూ.20వేల మధ్య పెరిగింది.
ఇన్వెస్టర్లు ఆచితూచి.. ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?
మూడు రోజుల్లో రూ.1500 తగ్గిన పసిడి
బంగారం ధరలు గత సెషన్ ముగింపు సమయానికి ఎంసీఎక్స్లో 0.35 శాతం ఎగిశాయి. వెండి 2 శాతం లేదా రూ.1,500 పెరిగింది. అయితే శుక్రవారం పసిడి దాదాపు రూ.1,000 వరకు తగ్గిన విషయం తెలిసిందే. గత వారం బంగారం రూ.56,200కు చేరుకొని గరిష్టాన్ని అందుకుంది. బంగారం ఈ మూడు రోజుల్లో రూ.1,500 వరకు తగ్గింది.
ఎంసీఎక్స్లో రూ.54,440 వద్ద మద్దతు ధర ఉండగా, రూ.55,000 దాటితే మాత్రం ఆ తర్వాత రూ.55,330 నుండి రూ.55,550 వరకు పెరగవచ్చునని బులియన్ మార్కట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పుంజుకున్న డాలర్... తగ్గిన బంగారం ధర
డాలర్ బలపడుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లోను బసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం మరో 0.1 శాతం ఎగిసింది. డాలర్ వ్యాల్యూ పెరిగితే.. ఇతర కరెన్సీ దేశాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. యూఎస్ స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్స్ ధర 2,021.32గా ఉంది. యూఎస్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 2,033.60 డాలర్లు పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే సిల్వర్ 1.2 శాతం పడిపోయి 28.81 డాలర్లకు, ప్లాటినమ్ 0.9 శాతం తగ్గి 978.10 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది పసిడి ధరలు 35 శాతం పెరిగాయి.
హైదరాబాద్లో తగ్గుదల
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200కు పైగా క్షీణించింది. అయితే రూ.58,000 పైనే ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.54 వేలకు దిగువకు వచ్చింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ధరలు, కేంద్రబ్యాంక్ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెల్లరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్, డాలర్ వ్యాల్యూ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.