రూ.40,000 దాటిన బంగారం: 2020లో భారీగా పెరగనున్న పసిడి.. ఎంతంటే?
ప్రపంచ బ్యాంకు సమాచారం మేరకు మార్కెట్లో బంగారం ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1500 డాలర్లకు అటు ఇటుగా, భారత మార్కెట్లో రూ.39 వేలకు అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. త్వరలో బంగారం ధరలు పెరుగుతాయనేది ప్రపంచ బ్యాంకు ఇటీవలి నివేదిక సారాంశం. ఈ నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు 5.6 శాతం పెరగవచ్చు. ఔన్సు బంగారం 1600 డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
మెచ్యూరిటీకి ముందే పీఎఫ్ ఉపసంహరించుకుంటే ట్యాక్స్ పడుతుంది
బంగారం ధరలు పెరుగుతూనే ఉండవచ్చు
బంగారంపై ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి ఇది షాక్ కావొచ్చు. కానీ విలువైన లోహాల ధరల పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ప్రభావం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లుగా ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది.
ఈ త్రైమాసికంలో 9.6 శాతం వృద్ధి అంచనా
థర్డ్ క్వార్టర్లో బంగారం ధరలు 12.6 శాతం మేర పెరిగాయి. ఇంతలా పెరగడం ఆరేళ్లలో ఇదే మొదటిసారి. అలాగే మూడేళ్లలో భారీ లాభాలు చవి చూశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత త్రైమాసికంలో బంగారం వృద్ధి 9.6 శాతంగా ఉంటుందని నిపుణుల అంచనా.
అంతకంతకు పెరగనున్న డిమాండ్
యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు, ప్రపంచ మార్కెట్లో అనిశ్చితుల కారణంగా బంగారం వంటి వాటికి బలమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు. మార్కెట్ అనిశ్చితుల భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తారని, దీంతో ధరలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్లాటినమ్, వెండి కంటే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ వంటి దేశాల్లో ఆభరణాలకు డిమాండ్ ఉంటుంది.
19 డాలర్లకు వెండి
వచ్చే ఏడాదికి ఔన్స్ బంగారం ధర 1600 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 4.9 శాతం పెరగవచ్చునని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంచనా. అంటే ఔన్స్ వెండి ధర 19 డాలర్లకు చేరుకునే అవకాశముంది. ఈ ఏడాదిలో వెండి ర్యాలీ 3.1 శాతం ఉంటుందని భావిస్తున్నారు.
బంగారంపై రూపాయి ప్రభావం ఉంటుంది
వచ్చే ఏడాది నాటికి రాగి ధరలు 2.3 శాతం పెరుగుతాయని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. మొత్తంగా బేస్ లోహాలు ఈ ఏడాది 5.2 శాతం క్షీణించగా, వచ్చే ఏడాది 1.4 శాతం పెరుగుతాయని అంచనా. మిగతా దేశాల కంటే భారత్లో బంగారం వినియోగం ఎక్కువ. ఇక్కడ పెట్టుబడితో పాటు ఆభరణాలు ధరిస్తారు. రూపాయి ప్రభావం కూడా బంగారంపై ఉంటుంది.
రూ.40వేల మార్క్ దాటిన బంగారం
ఇదిలా ఉండగా హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం రూ.310 పెరిగింది. దీంతో రూ.40,410కి చేరుకుంది. అంతర్జాతీయ కారణాలతో పాటు జ్యువెల్లర్స్, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడింది. శనివారం బంగారం ధర రూ.40 వేల మార్క్ దాటింది.