అక్కడ తగ్గినా.. ఇక్కడ పెరిగిన బంగారం ధరలు, దీపావళి నాటికి రూ.65,000?
గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. గత నాలుగు రోజుల్లో ఎంసీఎక్స్లో ఆల్ టైమ్ హై నుండి రూ.57వేల నుండి రూ.51వేలకు పడిపోయింది. తాజాగా బులియన్ మార్కెట్లో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా దేశీయ మార్కెట్లో మాత్రం పెరగడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.800 వరకు పెరిగి రూ.55,500కు చేరుకుంది. నిన్నటి వరకు రూ.54,600కు పైన ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.900కు పైగా పెరిగి రూ.51 వేలకు పైకి చేరుకుంది. కిలో వెండి రూ.2,000 పెరిగి రూ.67,000కు చేరుకుంది.
జూన్ నుండి మొదటి వారంలో తగ్గుదల
కరోనా తదనంతర పరిణామాల వల్ల పసిడి ధరలు నాలుగైదు నెలలుగా పెరుగుతున్నాయి. జూన్ నుండి అప్పుడప్పుడు అతి స్వల్పంగా తగ్గిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ వారంలోని తగ్గుదల నమోదు కాలేదు. ఓ వారంలో భారీగా తగ్గడం జూన్ నెల నుండి ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 4 శాతానికి పైగా తగ్గింది. తాజా పెరుగుదలతో మన దేశంలోను దాదాపు అంతే తగ్గింది.
అక్కడ తగ్గినా.. ఇక్కడ పెరిగిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 1,967 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్స్ ధర 1.04 శాతం తగ్గి 27.42కు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా దేశీయంగా పసిడి ధరలు మాత్రం పైపైకి చేరుకున్నాయి. బంగారం ధరలపై ద్రవ్యోల్భణం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ వ్యాల్యూ, జ్యువెల్లరీ మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, ట్రేడ్ వార్ వంటివి ప్రభావం చూపుతాయి. కరోనా వంటివి తాత్కాలికంగా చూపినప్పటికీ బలంగానే చూపాయి.
రూ.65వేలకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు
ఈ వారంలోనే పసిడి ధరలు భారీగా తగ్గాయి. తాజాగా పెరుగుదలను నమోదు చేశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ హై రూ.57వేల నుండి బుధవారం నాటికి రూ.51వేలకు పడిపోయింది. అంటే దాదాపు పది శాతం పడిపోయింది. వెండి 22 శాతం క్షీణించింది. రష్యా వ్యాక్సీన్ రావడంతో ధరలు తగ్గాయి. ఇతర దేశాల వ్యాక్సీన్లు వస్తే ప్రజలకు మరింతగా అందుబాటులో ఉంటే ధరలు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే కరోనా వల్ల పరిస్థితులు సానుకూలంగా లేకుంటే మాత్రం ఈ దీపావళి నాటికి పసిడి ధరలు తిరిగి రూ.65వేలకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
కిలో వెండి రూ.90వేలు...
అంతర్జాతీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో గోల్డ్ టార్గెట్ ఔన్స్ 2,100గా ఉందని చెబుతున్నారు. డిసెంబర్ నాటికి 2,350 డాలర్లకు పెరిగినా కొట్టి పారేయలేమని అంటున్నారు. కరోనా, అంతర్జాతీయ భౌగోళిక, ట్రేడ్ వార్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఆ రకంగా చూస్తే దీపావళి నాటికి 10 గ్రాముల పసిడి రూ.65వేలు, కిలో వెండి రూ.90వేలకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. గత ఏడాది ఇదే కాలంలోను బంగారం, వెండి ధరలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాదిలో బంగారం టార్గెట్ ఔన్స్ 2,280 లేదా రూ.62,000గా ఉంటుందని, వెండి రూ.75 వేలకు చేరుకుంటుందని కొందరు నిపుణులు ఇదివరకే అంచనా వేశారు. ఇందులో వెండి ప్రస్తుతానికి తగ్గినా, ఆ ధరను ఇటీవల అందుకుంది.