రికార్డ్స్థాయికి బంగారం ధరలు, 8 ఏళ్ల గరిష్టానికి సమీపంలో..: పసిడిపై మంచి రిటర్న్స్
బంగారం ధరలు నేడు (సోమవారం, జూన్ 29) పెరిగాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి ఏడాది నుండి అంతకంటే ఎక్కువ సమయం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్, ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్ 209 పాయింట్లు నష్టపోయి 34,961 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 10,312 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ నష్టాలు బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి.
బంగారం భారీ షాక్, రూ.50,000 మార్క్ దాటి పరుగులు.. ఆ భయాలే కారణం
బులియన్ మార్కెట్లో రూ.50,600
బంగారం ధరలు ఎంసీఎక్స్లో నేటి ఉదయం 10 గ్రాములు 0.24% పెరిగి రూ.48,305కు చేరుకున్నాయి. ఫ్యూచర్స్ 0.52శాతం పెరిగి రూ.49,494 పలికింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ.200కు పైగా పెరిగి రూ.46,400 దాటింది. 24 క్యారెట్ల బంగారం కూడా అంతే పెరిగి రూ.50,600కు పైకి చేరింది. ఇప్పటి వరకు ఆల్ టైమ్ హయ్యెస్ట్ ధర ఇది. వెండి కిలో రూ.48,100 పైకి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎనిమిదేళల్ గరిష్టానికి దగ్గరలో ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,769.54 డాలర్లు పలికింది. 2012 అక్టోబర్లోని గరిష్ట ధర 1,779.06 డాలర్లకు కేవలం 10 డాలర్ల దూరంలో ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,781.60కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు త్వరలో 1800 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏడాది కాలంగా మంచి రిటర్న్స్
గత ఏడాది కాలంగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి భారీ రిటర్న్స్ వస్తున్నాయి. 2019 అర్ధ సంవత్సరం కంటే 2020లో కరోనా దెబ్బకు లాభాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఎంసీఎక్స్లో బంగారం 23 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో 20 శాతానికి పైగా పెరిగాయి.