బంగారం ధర భగభగ.. భారత పసిడి చరిత్రలో రికార్డ్! వాటి వైపు ఇన్వెస్టర్ల పరుగు
బంగారం ధరలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. ఎంసీఎక్స్లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి రూ.50,010 పలికింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం రూ.50,000 మార్క్ చేరుకోవడం భారత పసిడి చరిత్రలో తొలిసారి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్ ఏకంగా 6.6 శాతం ఎగిసి కిలో రూ.61,130 పలికింది. బంగారం అంతకుముందు సెషన్లో కూడా 1 శాతం పెరిగింది. అదే సమయంలో వెండి 6 శాతం లేదా రూ.3,400 పెరిగింది. అంతకుముందు సోమవారం రూ.1,150 పెరిగింది.
భారీగా పెరిగిన బంగారం ధర, అక్కడ ఏకంగా రూ.1,000కి పైగా జూమ్
హైదరాబాద్, విజయవాడల్లో..
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,400కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 47,100 పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.49,100, 22 క్యారెట్లు రూ.47,900గా ఉంది.
అందుకే బంగారం వైపు చూపు
అంతర్జాతీయంగా బంగారం ధర తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. 2011 సెప్టెంబర్ నెలలో ఔన్స్ బంగారం 1,900 డాలర్లకు పైగా ఉంది. తాజాగా ఆ మార్క్ను దాటేసింది. డాలర్తో రూపాయి మారకం వ్యాల్యూ తగ్గడం కూడా దేశీయంగా బంగారం ధర పెరగడానికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ద్రవ్యోల్భణం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడ్ ప్యాకేజీ వల్ల డాలర్ వ్యాల్యూ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు.
సావరీన్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లలోకి ఇన్వెస్టర్ల పరుగు
కరోనా మహమ్మారి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు సావరీన్ గోల్డ్ బాండ్స్ వైపు గత కొంతకాలంగా తరలి వస్తున్నారు. నాలుగో దశలో నాలుగు టన్నులకు సమానమైన సబ్స్క్రిప్షన్ జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తున్న గోల్డ్ ఈటీఎఫ్లలోకి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.