రికార్డ్స్థాయికి.. బంగారం@రూ.51,000: కొనుగోలు వాయిదా, భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: బంగారం ధరలు నిన్న బుధవారం రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. కరోనా మహమ్మారి, ఇన్వెస్టర్ల డైలమా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి సమయం పట్టడం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలా వివిధ కారణాలతో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ఎంసీఎక్స్లో, రిటైల్ మార్కెట్లో బంగారం రోజురోజుకు పెరుగుతోంది. ముంబై, హైదరాబాద్ రిటైల్ మార్కెట్లలో రూ.50,000 దాటి రూ.51,000కు చేరుకుంది.
పెరిగిన బంగారం ధర: షాకింగ్.. 3 ఏళ్లలో రూ.లక్ష నుండి రూ.1,30,000?
బంగారం 10 గ్రాములు రూ.51,000
దేశ వాణిజ్చ రాజధాని ముంబై రిటైల్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 క్రాస్ చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో రూ.49,000కు సమీపంలో ఉంది. రూ.48,870 కంటే పైకి చేరుకొని గరిష్టానికి చేరుకుంది. డిల్లీలో 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ.647 పెరిగి రూ.49,908కి చేరుకుంది. కిలో వెండి రూ.1,611 పెరిగి రూ.51,870 పలికింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో అయితే బంగారం ధర రూ.51,000కు దగ్గరలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.50,500 నుండి రూ.50,950 వరకు పలికింది. మరో రూ.50 అయితే రూ.51,000కు చేరుకున్నట్లే.
రెండేళ్లలో 56 శాతం రిటర్న్స్
2018 మిడిల్లో బంగారం ధరలు రూ.30,000 నుండి రూ.32,000 మధ్య ఉన్నాయి. రెండేళ్లలో ఏకంగా 50,000 దాటింది. 56 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. 2020లో ఇప్పటి వరకు 25 శాతం పెరిగింది. గత ఏడాదిలో మందగమనం, దేశాల మధ్య ఉద్రిక్తతల దెబ్బతో పసిడికి కాస్త డిమాండ్ పెరిగితే ఇప్పుడు కరోనా దెబ్బతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఎదురవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి సమీపంలో ఉంది.
ఓ క్వార్టర్లో భారీ పెరుగుదల
బంగారం ధరలు ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో భారీగా పెరిగాయి. 2016 తర్వాత ఓ క్వార్టర్లో అతిపెద్ద పెరుగుదల నమోదు చేసింది. 2021 చివరి నాటికి బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 3,000 డాలర్లకు చేరుకోవచ్చునని, ఇండియాలో ఈ ధర రూ.82,000కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా మే నెలలో బంగారం దిగుమతులు 99 శాతం పడిపోయిన విషయం తెలిసిందే.
బంగారం కొనుగోలు వాయిదా.. అందుకే
ధర పెరుగుతుండటంతో ఇన్వెస్టర్స్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ రిటైల్ డిమాండ్ తక్కువగా ఉంది. ధరల దిద్దుబాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కరోనా తగ్గుముఖంపడితే ధరలు కాస్త దిగి రావొచ్చునని భావిస్తున్నారు. అందుకే కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దిద్దుబాటు ఉంటుందనే కారణంతో చాలామంది కొనుగోలును వాయిదా వేస్తున్నారని రిటైల్ ట్రేడర్స్ చెబుతున్నారు.
డిస్కౌంట్...
డిమాండ్ సన్నగిల్లడంతో డీలర్స్ ఔన్స్ బంగారంపై 22 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే దాదాపు ఔన్స్ పైన రూ.1500కు పైగా డిస్కౌంట్ ఉంది. గత వారం ఈ డిస్కౌంట్ 18 డాలర్లుగా ఉంది. మన దేశంలో ధరలకు 12.5 శాతం ఇంపోర్ట్ ట్యాక్స్, 3 శాతం సేల్స్ ట్యాక్స్ ఉంటుంది.