భారీగా పడిపోయిన బంగారం ధర, మూడ్రోజుల్లో రూ.5,000 తగ్గుదల: లాభాలు తీసుకోవడం వల్లే..
నాలుగు రోజులక్రితం వరకు దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు మూడు రోజుల్లో రూ.4,000 నుండి రూ.5,000 తగ్గింది. అయితే ఈ రోజు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనాకు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చిందని తెలియడంతో బంగారం నేలచూపులు చూసింది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రభావం భారత పసిడి మార్కెట్ పైన పడింది. కరోనా వెలుగుచూసిన అనంతరం పసిడి రూ.40వేల లోపు నుండి రూ.60వేల సమీపానికి చేరుకుంది. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది.
ఢిల్లీ మార్కెట్లో రూ.4,000కు పైగా తగ్గుదల
దేశీయ స్పాట్ మార్కెట్ న్యూఢిల్లీలో గత శుక్రవారం అంటే ఆగస్ట్ ఆగస్ట్ 7వ తేదీన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రికార్డ్ స్థాయిలో రూ.57,000 పైకి చేరుకుంది. నిన్న.. బుధవారం నాటికి రూ.52,300 దిగువకు వచ్చింది. అంటే ఏకంగా రూ.4,000కు పైగా తగ్గింది. ఎంసీఎక్స్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.1500 (3 శాతం) తగ్గి రూ.52 వేలకు పైగా మాత్రమే పలికింది. వెండి ఫ్యూచర్స్ 5 శాతం లేదా రూ.5000 పడిపోయింది. మొన్నటి సెషన్లో బంగారం రూ.3200 తగ్గింది. వెండి కిలో రూ.9000 పడిపోయింది.
పసిడి పెట్టుబడుల ఉపసంహరణ
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత శుక్రవారం ఔన్స్ ధర రికార్డ్స్థాయి 2078 డావలర్లకు చేరుకుంది. తొమ్మిదేళ్ల గరిష్టాన్ని అధిగమించింది. జూలై 27న రికార్డులు బ్రేక్ చేసింది. ఆ తర్వాత పదిపదిహేను రోజుల్లో బంగారం ధర దారుణంగా పతనమైంది. వ్యాక్సీన్ వచ్చిందని తెలియడంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపారు. శుక్రవారం నుండి పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది.
ఓ సమయంలో 1876 డాలర్లకు పడిపోయి..
బుధవారం రాత్రి సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో గరిష్టం 2,078 డాలర్ల నుండి 130 డాలర్లకు పైగా తగ్గి 1,947కు పైగా ట్రేడ్ అయింది. ఓ దశలో 200 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూసింది. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కాస్త పుంజుకుంది. కీలక నిరోధ స్థాయి 1,911 డాలర్లని దాటింది. మొత్తంగా బంగారం 1,950 డాలర్లకు అటు ఇటుగా ఉంది.