కరోనా వ్యాక్సీన్ ఎఫెక్ట్, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? రూ.51,000కు దిగువనే...
బంగారం, వెండి ధరలు మంగళవారం(నవంబర్ 17) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రం గం.9.00 సమయానికి 10 గ్రాముల పసిడి రూ.64.00 (0.13%) క్షీణించి రూ.50,766.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,800.00 వద్ద ప్రారంభమైన పసిడి, రూ.51,029.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,715.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7న నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ధర రూ.5,450 వరకు తక్కువగా ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పసిడి ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి.
బంగారం, వెండి ధర క్షీణత
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.64 తగ్గగా, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.51.00 (-0.10%) క్షీణించి రూ.50,855.00 పలికింది. రూ.50,906.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,080.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,790.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.600 తగ్గింది. కిలో వెండి రూ.593.00 (-0.93%) క్షీణించి రూ.63,098.00 పలికింది. రూ.63,690.00 ప్రారంభమైన ధర, రూ.63,715.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,846.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.436.00 (-0.67%) తగ్గి రూ.65,053.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,496.00 ప్రారంభమైన ధర, రూ.65,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,733.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో ఔన్స్ పసిడి 1.05 (-0.06%) డాలర్లు తగ్గి 1,886.75 డాలర్లు పలికింది. 1,882.40 - 1,892.65 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,887.80 వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో పసిడి 26.03% శాతం పెరిగింది. వెండి ఔన్స్ 0.160 (-0.65%) డాలర్లు క్షీణించి 24.642 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.503 - 24.898 డాలర్ల వద్ద ట్రేడ్ అయిన వెండి, క్రితం సెషన్లో 24.802 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాది కాలంలో 46.52% శాతం మేర పెరిగింది.
బంగారంపై తగ్గిన ఒత్తిడి
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వివిధ ఫార్మా సంస్థలు తమ వ్యాక్సీన్ 90 శాతం నుండి 94.5 శాతం మధ్య ఫలితాలు ఇస్తున్నాయని ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు ఊపిరితీసుకుంటున్నాయి. వ్యాక్సీన్ వస్తే కరోనా కేసులు పెరిగినా ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. బంగారంపై ఒత్తిడి తగ్గింది. సమీప కాలంలో 1900 డాలర్లకు దిగువనే కొనసాగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ.51,000 వద్ద నిరోధకస్థాయి, రూ.50660-రూ.50440 మధ్య మద్దతు ధరగా భావిస్తున్నారు.