భారీగా తగ్గిన బంగారం ధర, అక్కడ జపాన్ ప్యాకేజీ ఎఫెక్ట్! ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధరలు ఈ రోజు (మే 27) తగ్గాయి. ఇటీవలి వరకు అంతకంతకు పెరిగిన ధరలు కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఎంసీఎక్స్లో ఉదయం గం.9.30 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.12 శాతం లేదా రూ.57 తగ్గి రూ.46,265 పలికింది. వెండి ధర కిలో 0.11 శాతం లేదా రూ.51 తగ్గి రూ.47,770 పలికింది.
భారీగా తగ్గిన బంగారం ధర: పసిడి డిమాండ్ ఎందుకు తగ్గిందంటే?
కొనుగోలు చేయవచ్చా?
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి పరిస్థితి సద్దుమణిగినప్పటికీ బంగారం ధరలు ఇంతకు మరీ తక్కువగా వెళ్లే అవకాశాలు లేవని, కాబట్టి దీర్ఘకాలం పెట్టుబడి కోరుకునే వారు కాస్త తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
జపాన్ ప్యాకేజీ ప్రభావం..
ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటం, అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా వైరస్ వ్యాక్సిన్ వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపిస్తాయి. జపాన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఒత్తిడిని తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర ఔన్స్ 1692 (ఇండియన్ కరెన్సీ రూ.45,920) ఉండవచ్చునని, వెండి మద్దతు ధర 17.20 డాలర్లు (రూ.47,200) లెవల్లో ఉండవచ్చునని చెబుతున్నారు. బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో లాంగ్ టర్మ్ పెట్టుబడి కోసం కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు.
ఇండియాలో గత నెల రోజుల్లో బంగారం ధరలు..
బంగారం ధరలు గత నెలరోజుల్లో తగ్గుతూ... పెరుగుతూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 27వ తేదీన అహ్మదాబాద్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,125 పలికింది. ఆ తర్వాత ఇది మే 15వ తేదీన రూ.47,360 పలికింది. ఈ రోజు రూ.46,250కి అటు ఇటుగా ఉంది.
దేశీయ మార్కెట్లో...
బుధవారం దేశీయ మార్కెట్లో పసిడి ధర కొద్ది రోజుల క్రితంతో పోలిస్తే ఓ సమయంలో భారీగా తగ్గింది. ఉదయం 10 గ్రాముల బంగంర రూ.1,013 తగ్గి రూ.46,048 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 35 డాలర్లకు పైగా తగ్గింది. నిన్న ఎంసీఎక్స్లో బంగారం ధర రూ.223 తగ్గింది.