ఈక్విటీతో ఒత్తిడి తగ్గి.. హైదరాబాద్ సహా బంగారం ధరలు ఇలా
బంగారం ధరలు ఈరోజు (జూలై 8, బుధవారం) స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్ (మల్టీకమోడిటీ ఎక్స్చేంజ్)లో ఆగస్ట్ పసిడి ఫ్యూచర్స్ ఉదయం 10 గ్రాములు 0.2 శాతం తగ్గి రూ.48,712 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.9 శాతం తగ్గి రూ.50,067 పలికింది. బంగారం ధర నిన్న 1.2 శాతం, వెండి 0.9 శాతం పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా డైలమా నేపథ్యంలో ధరలు పెరిగాయి.
షాప్స్లో డిమాండ్ లేకున్నా పెరుగుదల: ఇక బంగారం ధర తగ్గుతుందా, ఇన్వెస్ట్ చేయవచ్చా?
హైదరాబాద్లో బంగారం ధర
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 పలికింది. గత నాలుగైదు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఐదు రోజుల్లో రూ.300కు పైగా మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ల బంగారం మాత్రం పెరిగి రూ.46,410కి చేరుకుంది. వెండి ధర కిలో రూ.400 తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ మందగించింది.
అలా బంగారంపై తగ్గిన ఒత్తిడి
ఎంసీఎక్స్లో ప్రారంభ వాణిజ్యంలో మాత్రం ధర పెరిగింది. దేశంలో కరోనా కేసులు పెరగడం, వ్యాక్సీన్ ఆలస్యమవుతుందనే పలు కారణాలతో ఇన్వెస్టర్లు పసిడి వైపు చూశారు. అయితే మార్కెట్లు నేడు ఆరో రోజు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. ఢిల్లీ మార్కెట్లోను తొలుత స్వల్పంగా పెరిగాయి. ఉదయం రూ.102 పెరిగి రూ.49,228కి చేరుకుంది.
అక్కడ ఎనిమిదేళ్ల గరిష్టానికి
కరోనా కేసులు పెరుగుతుండటం, గ్లోబల్ మార్కెట్లు అస్థిరంగా ఉండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించేందుకు మరిన్ని ఉద్దీపన చర్యలు అవసరమని భావిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలకు మద్దతు లభించింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,793.56 పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి ఔన్స్ ధర 1,806.30 డాలర్లుగా ఉంది.