బంగారం భగభగ.. 10 రోజుల్లో రూ.4వేలు జూమ్: గోల్డ్@రూ.56,000!
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శనివారం ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.680 పెరిగి రూ.54,540 పలికింది. హైదరాబాద్లో 10 గ్రాములు రూ.220 పెరిగి రూ.55,820 పలికింది. గత పది రోజుల్లో బంగారం ధరలు రూ.4వేల వరకు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, దేశీయంగా డిమాండ్ పెరగడం వంటి వివిధ అంశాలు పెరగడానికి కారణం. వెండి గిలో ధర కూడా రూ.2,850 పెరిగి రూ.65,900 పలికింది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1976 డాలర్లు, వెండి 24 డాలర్లు పలికింది.
హైదరాబాద్లో భారీగా తగ్గిన హౌసింగ్ సేల్స్, ధరలు ఎలా ఉన్నాయంటే?
మరికొంత కాలం పెరగొచ్చు
ఈ క్యాలెండర్ ఇయర్లో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 30 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ వ్యాల్యూ క్షీణించడం, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఫెడ్ రిజర్వ్ మద్దతు, కరోనా కేసులు పెరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు అంతర్జాతీయంగా పసిడి వంటి అతి ఖరీదైన లోహాల వైపు చూస్తున్నారు. అమెరికాతో పాటు వివి దేశాలు ఆయా ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు ఉద్దీపనలు ప్రకటించనున్నాయి. ఇది కూడా బంగారానికి డిమాండ్ పెంచింది. శుక్రవారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1983.36 డాలర్లకు చేరుకుంది. బంగారం, వెండి ధరలు మరికొంతకాలం పెరిగే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతూనే ఉంది...
కరోనా కేసుల ప్రభావం మార్కెట్లపై ఎప్పటికప్పుడు ఉంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని, ఈ ప్రభావం భారత బులియన్ మార్కెట్ పైన పడుతోందని నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు గత సోమవారం రూ.53,480 వద్ద ప్రారంభమయ్యాయి. 22 క్యారెట్ల బంగారం రూ.49వేల పైగా పలికింది. ఆ రోజు నుండి పెరుగుతూనే ఉంది.
ఆకాశాన్ని తాకడంతో
శనివారం సాయంత్రానికి హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం రూ.51,780కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం రూ.56,490 పలికింది. ఈ వారం రోజుల్లోనే బంగారం ధరలు 3వేల వరకు పెరిగింది. శ్రావణ మాసం సమయంలో రిటైల్ పసిడికి గతంలో ఉన్నటువంటి డిమాండ్ కనిపించడం లేదని అంటున్నారు. ఇందుకు ధరలు ఆకాశాన్ని తాకడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.