అమ్మో.. బంగారం: రూ.1,300 పెరుగుదల.. రూ.58,000కు చేరువ: ఈ ఏడాది భారీ రిటర్న్స్
హైదరాబాద్: బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులకు చేరుకున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా దూసుకెళ్తోంది. ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 1.35 శాతం ఎగిసి రూ.55,390 పలకడం గమనార్హం. వెండి కిలో ధర 4 శాతం పెరిగి రూ.72,654కు చేరుకుంది. అంతకుముందు సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం లేదా రూ.900 పెరిగి రూ.54,612 మార్క్ చేరుకుంది. వెండి రూ.4,200 లేదా 6.4 శాతం పెరిగింది. బుధవారం మరోసారి భారీగా పెరిగాయి.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్, ఢిల్లీల్లో..
బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.1,365 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పసిడి రూ.56,171కి చేరుకుంది. మంగళవారం ముగింపు ధర రూ.54,816గా ఉంది. హైదరాబాద్లో రూ.58వేల మార్క్కు సమీపంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.57,820 పలికింది. ఒక్కరోజే రూ.1,000కి పైగా పెరిగింది. కిలో వెండి ధర దాదాపు రూ.6,000 పెరిగింది. కిలో వెండి ఆయా ప్రాంతాల్లో రూ.72వేల నుండి రూ.74వేల వరకు ఉంది. రిటైల్ మార్కెట్లో డిమాండ్ లేకున్నా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, కరోనా అనిశ్చితులు కారణంగా చెబుతున్నారు

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఓ దశలో ఔన్స్ 2,060 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి 27.20 డాలర్లకు చేరుకుంది. ఈ సీజన్లో పసిడి ఔన్స్ 2,040 డాలర్లకు చేరుకుంటుందని వ్యాపారవర్గాలు అంచనా వేశాయి. కానీ ఈ అంచనాలను దాటేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పసిడి 2,200 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. జూలై 27న తొమ్మిదేళ్ల గరిష్టాన్ని బంగారం బ్రేక్ చేసింది. కానీ పదిరోజుల్లోనే 2,050 డాలర్లు దాటింది. పసిడి 52 వారాల కనిష్టస్థాయి 1,428 డాలర్లు. అంటే దాదాపు 50 శాతం పెరిగింది. మన వద్ద రూపాయి బలహీన ధోరణి కూడా పసిడి ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

పెరుగుదలకు కారణాలు
అగ్రరాజ్యాలు ప్రకటిస్తున్న ఉద్దీపనలు, బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మందగమనం, కరోనా నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితులు అతివిలువైన లోహాలు భారీగా పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అమెరికా సహా ఆర్థిక వ్యవస్థలు అన్నీ నెమ్మదించాయి. కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే తగ్గి పెరుగుతోంది. మరణాలు పెరుగుతున్నాయి. ఈ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. ఏ దేశ కేంద్ర బ్యాంకు కూడా తన వద్ద పసిడి నిల్వలను అమ్మకానికి పెట్టకపోవడం కూడా ధరల దిద్దుబాటు జరగకపోవడానికి కారణంగా చెబుతున్నారు. చైనా వాణిజ్య భయాలు కూడా వెంటాడుతున్నాయి. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గక పోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేటును మరింత తగ్గిస్తుందనే భయాలు ఉన్నాయి.

3,000 డాలర్లకు.. భారీ రిటర్న్స్
బంగారం ధరల పెరుగుదల ముందుముందుకూడా కొనసాగనుందని, ఈ నెలలో ఔన్స్ గోల్డ్ 2,150 డాలర్లు, వెండి 30 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. రానున్న 18 నెలల్లో ఔన్స్ పసిడి 3,000 డాలర్లకు చేరుకోవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు బంగారం, వెండి భారీ రిటర్న్స్ అందించాయి. ఇప్పటి వరకు పసిడి 40 శాతం, సిల్వర్ 50 శాతం ప్రతిఫలం అందించాయి. ధరల్లో అప్ ట్రెండ్ మరికొంతకాలం కొనసాగే అవకాశాలు లేకపోలేదు.


Click it and Unblock the Notifications