ఆగస్ట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి.. ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉండొచ్చు?
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ వారం కూడా పసిడి కాంట్రాక్ట్ సానుకూల ధోరణితో కొనసాగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. పసిడి రూ.54,175 కంటే తక్కువకు వస్తే అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్ మరింతగా ముదిరితే మాత్రం బంగారం కాంట్రాక్ట్ మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వెండి సెప్టెంబర్ ధర రూ.69,550 కంటే పైన ఉంటే సానుకూలంగానే ఉండవచ్చునని, అదే సమయంలో అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
బంగారం ఎఫెక్ట్: రాకేష్ ఝున్ఝున్వాలాకు రూ.1,500 కోట్ల ఆదాయం
మొన్న స్వల్పంగా తగ్గిన ధరలు..
శుక్రవారం అటు కామెక్స్లో, ఇటు ఎంసీఎక్స్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 1.89 శాతం తగ్గి రూ.54,789 పలికింది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.74,160 పలికింది. దేశంలో బంగారం వినియోగం భారీగా ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలను బట్టి ధరల్లో స్వల్పంగా తేడా ఉంటుంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,700గా ఉంది. హైదరాబాద్లో రూ.59,000కు చేరుకుంది.
డాలర్ ప్రభావం.. అందుకే పసిడి పతనం
సోమవారం ఆసియా ప్రారంభ ట్రేడింగ్ సెషన్లో పసిడి ఔన్స్ 2,027 డాలర్లకు పడిపోయింది. శుక్రవారం పడిపోయిన ధర మళ్లీ ఈ రోజు తగ్గింది. రెండు నెలల్లో ధర ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. కనిష్టానికి తగ్గలేదు కానీ, ఇదివరకు స్వల్పంగా తగ్గిన ధర ఇప్పుడు ఎక్కువగా క్షీణించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించిన విషయం తెలిసిందే. అమెరికా డాలర్ క్రమంగా బలపడటం కూడా బంగారం ధర తగ్గడానికి ఓ కారణంగా చెబుతున్నారు.
ఆగస్ట్లో ఆచితూచి..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జూలై నెలలో 11 శాతానికి పైగా పెరిగాయి. అయితే ఆగస్ట్లో మాత్రం బంగారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆగస్ట్లోను మొదట ఆసక్తి చూపినప్పటికీ, తర్వాత మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా డాలర్ రెండేళ్ల కనిష్టం నుండి తిరిగి పుంజుకుంటుండటం. అలాగే, అమెరికాలో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గి, 10.2 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.