ఏడాదిలో 17% నష్టాలు తెచ్చిన బంగారం, ఎలాగంటే: పోర్ట్పోలియోలో తప్పనిసరి!
పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.46,300 వద్ద ఉంది. పసిడి పైన ఏడాది రిటర్న్స్ ప్రస్తుతం మైనస్ 17 శాతం కంటే ఎక్కువగా ఉంది. గత ఏడాది ఇదే ఆగస్ట్ నెలలో పది గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 వద్ద ఉంది. ఆ ధరతో ఇప్పుడు రూ.10వేల వరకు తక్కువగా ఉంది. 2020 ఆల్ టైమ్ గరిష్టం ఉన్న సమయంలో ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు అట్టే అట్టిపెట్టుకుంటే వారు ఈ మేరకు నష్టపోయినట్లే. 2021 సంవత్సరం కూడా బంగారం రూ.50,000కు కాస్త అటుఇటుగా ప్రారంభమైంది. ఇప్పుడు రూ.46,000కు పైన ఉంది. ఈ ఏడాది ప్రారంభంతో పోల్చినా 10 శాతం మేర నష్టపోయినట్లే. గత పదిహేనేళ్ల కాలంలో బంగారంపై రిటర్న్స్ తగ్గడం ఇది రెండోసారి. 2014 నవంబర్ నెలలో వన్ ఇయర్ రిటర్న్స్ 17.6 శాతం మేర క్షీణించాయి. ఇప్పుడు 17.1 శాతం మేర క్షీణించాయి.
దీర్ఘకాలంలో సానుకూలం
బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో సానుకూలంగానే ఉంటుంది. బంగారం మున్ముందు కాలంలో పెరుగుదలనే చూస్తుంది. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు సహజం. కరోనా వంటి అరుదైన విపత్తుల సమయంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తాయి. ప్రస్తుతం బంగారం మరి కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్వల్పకాలంలో పెట్టుబడిపై ఆచితూచి వ్యవహరించాలి. దీర్ఘకాలంలో మాత్రం పెట్టుబడికి పర్వాలేదని చెబుతున్నారు.
ద్రవ్యోల్భణానికి మించి రాబడి
బంగారం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ పెట్టుబడి పైన ఎలాంటి డివిడెండ్ లేదా వడ్డీ ఉండదు. అంతర్జాతీయంగా కమొడిటీ, చమురు, డాలర్పై ఆధారపడి ధరలు మారుతాయి. దీనిపై సాధారణ పెట్టుబడిదారులు అంతగా ఆసక్తితో ఉండరు. రియాల్టీ పెట్టుబడుల్లో లిక్విడిటీ సమస్యలు, ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు రిజిస్ట్రేషన్, ఆక్రమణలు వంటి సమస్యలుంటాయి. అయితే ఈ పెట్టుబడులపై వచ్చే రాబడిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రియాల్టీ పెట్టుబడులపై దీర్ఘకాలిక రాబడి, మార్కెట్లలో వచ్చే రాబడి కంటే తక్కువగా ఉంటుంది. పసిడి పెట్టుబడులు కూడా ఇలాగే ఉంటాయని భావించవచ్చు. బంగారంతో పోలిస్తే రియాల్టీ పెట్టుబడులపై కొంత ఎక్కువ రాబడి వచ్చే అవకాశమున్నప్పటికీ, ఇది పెట్టుబడితో కూడినది. గత ఐదేళ్లుగా చూస్తే ఈ రియాల్టీతో పాటు బంగారం ద్రవ్యోల్బణానికి మించి రాబడిని అందిస్తున్నాయి.
పోర్ట్పోలియోలో బంగారం
పోర్ట్పోలియోలో బంగారం పెట్టుబడులు 5 శాతం నుండి 10 శాతం ఉండేలా చూసుకోవాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణానికి మించి రాబడి వస్తోంది కాబట్టి బంగారం కోసం కొంత కేటాయించాలని అంటున్నారు. బంగారం పెట్టుబడులు ఈటీఎఫ్, సావరీన్ గోల్డ్ బాండ్స్ ద్వారా పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
బాండ్స్, ఈటీఎఫ్స్ ద్వారా బంగారం పెట్టుబడులు పన్ను తక్కువగా ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా రియాల్టీతో పాటు బంగారం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా ధైర్యంగా ఉండవచ్చు. కానీ పెద్దగా అదనపు రాబడి మాత్రం ఉండదు.