బంగారం పరుగులు: ఒక్కరోజే భారీగా పెరిగిన ధరలు.. ఆ భయాలతో ఆల్ టైమ్ హైకి
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి లాక్ డౌన్ ఉండవచ్చుననే ఊహాగానాల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బుధవారం పసిడి ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. ముంబైలో జవేరీ బజార్లో 10 గ్రాములకు (స్టాండర్డ్ గోల్డ్) జీవనకాల గరిష్టం రూ.48,925కు చేరుకుంది. నిన్న 1.4 శాతం పెరిగింది. 3 శాతం జీఎస్టీ, ట్యాక్స్ వంటివి కలిసి 10 గ్రాములకు రూ.50,000 దాటింది. వెండి ధర కూడా మొదటిసారి కిలో రూ.50,000 దాటింది. బుధవారం 2.6 శాతం పెరిగి రూ.50,140 పలికింది.
72 లక్షల మంది PF ఖాతాదారులకు కేంద్రం గుడ్న్యూస్: ఆగస్ట్ వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్
ఫ్యూచర్లో రూ.49,000, స్పాట్ మార్కెట్ రూ.51,000
ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా పసిడి భారీగానే పెరిగింది. మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్(MCX)లో ఆగస్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల 24 కేరట్ల బంగారం ధర బుధవారం ఓ దశలో రూ.49,045 పలికింది. ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి ధర ఈ రికార్డుకు చేరుకోవడం ఇది మొదటిసారి. స్పాట్ మార్కెట్లో పసిడి ధర ఆకాశాన్నంటుతోంది. ఢిల్లీలో రూ.723 పెరిగి 10 గ్రాముల ధర రూ.49,898కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,990 వరకు పలికింది.
పసిడి పరుగుకు కారణం
అంతర్జాతీయ ధరలకు తోడు డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం పసిడి రేటు పెరుగుదలకు కారణమైంది. అలాగే కరోనా కేసులు పెరగడం, మళ్లీ పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉంటుందనే ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను ఒత్తిడికి గురి చేశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం రూ.370 పెరిగి రూ.51 వేలకు చేరువైంది. బుధవారం బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.50,990 పలికింది. కరోనా కేసులు పెరగడంతో ఇన్వెస్టర్లు బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.
పదేళ్ల గరిష్టానికి
2020 జనవరి నుంచి బంగారం ధర ఏకంగా 11 వేలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం దాదాపు పదేళ్ల గరిష్టానికి చేరుకుంది. మార్కెటన్లో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1,800 డాలర్లు పలికింది. 2011 తర్వాత ఇదే గరిష్టం. వెండి ఔన్స్ 18.36 డాలర్లు పలికింది. స్పాట్ గోల్డ్ ధర కూడా 1800 డాలర్లకు పైన ఉంది. కాగా, కరోనాతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న పసిడిని కొనే పరిస్థితి కూడా లేదంటున్నారు.
పెరుగుదలకు కారణాలు
కరోనా భయాలు ఏమాత్రం తగ్గడంలేదు. మెడిసిన్ లేదా వ్యాక్సీన్ వస్తోందనే వార్తలు, ఆర్థికవ్యవస్థలు కోలుకునే అంశానికి సంబంధించి ఆధారపడి అప్పటికి అప్పుడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఆ వెంటనే మళ్లీ పెరుగుతున్నాయి. దీనికి తోడు చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మన దేశంలో లాక్ డౌన్ ఊహాగానాలు, కరోనా కేసులు బంగారం సెంటిమెంట్ను బలపరుస్తున్నాయి.
బంగారం ధరలు తిరిగి తగ్గుతాయా?
బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ దీనిని సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధరలు పెరుగుతున్న కొద్ది కాస్త దూరం జరుగుతున్నారు. కరోనా తర్వాత తగ్గుతాయేమో అనే ఆశలు వారిలో ఉన్నాయి. కానీ రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూస్తే మళ్లీ రూ.48వేల లోపుకు వచ్చే పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. అయితే ఈక్విటీ మార్కెట్లను ఓ కంట కనిపెడుతూనే ఇన్వెస్టర్లు బంగారంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఆరు నెలల్లో మరో 10 శాతం పెరుగుదల
పసిడి ధరలు రానున్న ఆరు నెలల నుండి తొమ్మిది నెలల మధ్యకాలంలో మరో 10 శాతం ర్యాలీ అయ్యే అవకాశం ఉందని కొటక్ మహీంద్రా బ్యాంకు గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ హెడ్ శేఖర్ బండారీ అన్నారు. బుధవారం రూ.50వేలు దాటింది. ఈ లెక్కన డిసెంబర్ నుండి వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.55వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన బంగారం 40 శాతానికి పైగా పెరిగింది.