Gold consumption: ధనికుల కంటే వారే బంగారం ఎక్కువగా కొంటున్నారు
భారత్లో మధ్యస్థాయి ఆదాయ, తక్కువ ఆదాయ వర్గాలు పసిడిని అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్త హౌస్ హోల్డ్ గోల్డ్ కన్సంప్షన్ సర్వేలో ధనికుల కంటే పైన పేర్కొన్న వర్గాలు బంగారం కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది. తలసరి వినియోగం పరంగా మాత్రం ధనికులు ముందు ఉన్నప్పటికీ, మొత్తం పరిమాణంపరంగా అధిక కొనుగోలు ఇప్పటికీ మధ్య ఆదాయ వర్గాల్లోనే కనిపిస్తోంది. ఆదాయం పెరుగుతున్నా కొద్ది బంగారాన్ని వినియోగించడం కూడా పెరుగుతోందని, తమ పోర్ట్పోలియోలో బంగారం కొనసాగిస్తున్నారని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ తెలిపింది.
ఎవరు ఎంత?
ఏడాదికి రూ.20 లక్షల కంటే పైగా ఆదాయం కలిగిన వారు సగటున 27 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేస్తుండగా, తక్కువ ఆదాయం కలిగిన వారు 51.68 గ్రాములు, రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 25.13 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరింత లోతుగా వెళ్తే FY21లో రూ.1 లక్ష లోపు ఆదాయం ఉన్నవారి తలసరి వినియోగం 7.71 శాతం, రూ.1 లక్షల నుండి రూ.2 లక్షల ఆదాయం ఉన్నవారి తలసరి వినియోగం 9.57 శాతం, రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారి తలసరి వినియోగం 9.27 శాతం, రూ.5 నుండి రూ.10 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారి తలసరి వినియోగం 11.13 శాతం, రూ.10 నుండి రూ.20 లక్షల ఆదాయం కలిగిన వారి తలసరి వినియోగం 13.99 శాతం, రూ.20 లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారి తలసరి వినియోగం 27.4 శాతంగా ఉంది.ఎక్కువ బంగారం కొనుగోలులో రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారు ఉన్నారు.
నగదుకే మొగ్గు
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమంటే, బంగారాన్ని కొనుగోలు చేయడానికి నగదు చెల్లింపు వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. గత అయిదేళ్లలో పసిడి కొనుగోలు చేసిన వారిలో 74 శాతం మంది ఇందుకు అవసరమైన చెల్లింపుల్లో 90 శాతం నగదు ద్వారానే చేశారు.
గ్రామాలతో పోలిస్తే పసిడి కొనుగోళ్లలో పట్టణ ప్రాంతాలు ముందు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో విక్రయమవుతున్న బంగారంలో 70 శాతం ఈ ప్రాంతాల్లోనే అమ్ముడవుతోంది. పట్టణీకరణ పెరిగే కొద్ది డిమాండ్ పెరుగుతోందని అంచనా వేస్తోంది.
మహిళల మొగ్గు
75 శాతం మంది గృహిణులు ఏదో ఒక రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. 43 శాతం మంది పెళ్లిళ్ల కోసమే బంగారం కొనుగోలు చేస్తుండగా, 31 శాతం మంది సాధారణంగా ఎలాంటి అవసరం లేకపోయినా ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 2016లో తీసుకు వచ్చిన పెద్ద నోట్ల రద్దు లేదా ఆ తర్వాత అమలులోకి వచ్చిన జీఎస్టీ వల్ల బంగారం కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపలేదు. 74 శాతం మంది గృహిణులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.