త్వరలో బంగారం@రూ.65,000, వెండి@రూ.75,000? పెరుగుదలకు కారణాలివే..
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ఆరు కరెన్సీల జాబితాలో అమెరికా డాలర్ నష్టపోవడం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడం వంటి వివిధ కారణాలు అతి ఖరీదైన బంగారం, వెండి వంటి లోహాల ధరలు మరింతకాలం పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత వారం బంగారం 10 గ్రాములు రూ.2,000 వరకు, వెండి రూ.8,000 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ పెరుగుదల మరింతకాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్లో బంగారం రికార్డ్, 5రోజుల్లో రూ.2,000 జంప్: ధరల పెరుగుదల నిలిచిపోయే ఛాన్స్ లేదా?
బంగారం రూ.65,000, వెండి రూ.75,000
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం ఔన్స్కు 1,900 డాలర్లకు చేరుకున్నాయి. 2011 తర్వాత ఈ స్థాయికి మొదటిసారి చేరుకుంది. వెండి ధర కూడా ఔన్స్ 23 డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ సెప్టెంబర్ నాటికి ఔన్స్ బంగారం 2,000 డాలర్లకు, వచ్చే ఏడాది కాలంలో 2,500 డాలర్లకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. వచ్చే 12 నెలల్లో 10 గ్రాముల బంగారం రూ.65,000కు, కిలో వెండి రూ.75,000 చేరుకోవచ్చునని చెబుతున్నారు. నవంబర్ వరకు బంగారం ధరలు ఇలాగే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఎంసీఎక్స్, హైదరాబాద్లో రికార్డ్ ధర
ఎంసీఎక్స్లో 24 క్యారెట్ల పసిడి గత వారం రూ.50,000 రికార్డ్ ధరను దాటింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం రూ.53,470కు చేరుకుంది. కిలో వెండి రూ.61,200 పలికింది. ముంబై మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం పది గ్రాములు రూ.51,124గా ఉంది. కిలో వెండి రూ.59,885గా ఉంది. రానున్న ఏడాది కాలంలో 10 గ్రాముల బంగారం రూ.65,000, కేజీ వెండి రేటు రూ.75,000 దాటవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా. మందగమనం కారణంగా గత ఏడాది మిడిల్ నుండి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ 12 నెలల కాలంలో ధరలు 60 శాతం పెరిగాయి. పసిడి ధరలు పెరుగుతుండటంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
పెరుగుదలకు కారణాలు
బంగారం పెరుగుదలకు వివిధ కారణాలు ఉన్నాయి. బలహీనమైన డాలర్ వ్యాల్యూ, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల నుండి తాజా ఉద్దీపనలు, అమెరికా - చైనా మధ్య టెన్షన్స్, కరోనా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణత భయాలు, వివిధ దేశాల్లో వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోవడం, అమెరికాలో అయితే సున్నాకు చేరువ కావడం వంటి వివిధ కారణాలు ఉన్నాయి.
తగ్గిన రిటైల్ సేల్స్
కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ వల్ల మార్కెట్ స్తంభించింది. దీంతో దాదాపు మూడు నెలలు బంగారం దుకాణాలు తెరుచుకోలేదు. ప్రస్తుతం తెరిచి ఉన్నప్పటికీ ధరల పెరుగుదల వంటి వివిధ కారణాలతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి తగ్గింది. ధరల పెరుగుదలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో చేతిలో నగదు ఉండాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. దీంతో రిటైల్ కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆభరణాల డిమాండ్ పడిపోయిందని, 20 శాతం నుండి 25 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోందని, ఈ తరుణంలో ధరలు భారీగా పెరుగుతుండటంతో జ్యువెల్లరీ విక్రయాలకు మరింత గండిపడుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. కోరనా కారణంగా పెళ్లిళ్లు, పండుగలు సాదాసీదాగా జరుపుకోవాల్సిన పరిస్థితి అని, దీంతో నగలు కొనేవారు కరువయ్యారని చెబుతోంది.