Gold Amnesty: బంగారంపై పన్ను.. అమలు అసాధ్యం, ఎందుకంటే!
న్యూఢిల్లీ: పరిమితికి మించి బంగారం ఉంటే ప్రజలంతా తెలియజేయాలని, దానిపై పన్ను ఉంటుందని, గడువులోగా వివరాలు తెలియజేయకుంటే ఆ తర్వాత జరిమానా ఉంటుందనే వార్తలు రావడంపై కేంద్ర ఆర్థిక శాఖ గురువారం క్లారిటీ ఇచ్చింది. పరిమితికి మించిన బంగారం వివరాలు తెలియజేసే ఆమ్నెస్టీ స్కీం ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా సంస్థలు.. రసీదుల లేని లేదా లెక్కల్లోకి రాని బంగారాన్ని బయటపెట్టి దానికి పన్ను చెల్లించి చట్టబద్దం చేసుకోవాలని గత రెండు రోజుల పాటు వార్తలు జోరుగా వచ్చాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ స్పందించింది.
ప్రస్తుతం చాలామంది తమ నల్లధనాన్ని బంగారం రూపంలో దాచి పెడుతున్నారు. దీనిని బయటకు తీసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కొంతమంది భావించారు. కానీ అలాంటిదేమీ లేదని కేంద్రం కొట్టి పారేసింది. బడ్జెట్ తయారీ సమయంలో ఇలాంటి పుకార్లు సహజమేనని కొట్టి పారేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ఆలోచన చేస్తోందా, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఈ చర్చ జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే నోట్ల రద్దు వలె దీని అమలు అంతగా సులభం కాదని అంటున్నారు. నోట్ల రద్దు తర్వాత 2017లో ప్రకటించిన క్షమాభిక్ష పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లేదా ఐడీఎస్ 2 పరిమిత స్థాయిలో విజయం సాధించింది.
బంగారం ధరలు, గోల్డ్ ఆమ్నెస్టీ స్కీం.. మరిన్ని కథనాలు
ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకేనా?
నోట్ల రద్దు అనంతరం 2017లో కేంద్రం క్షమాభిక్ష పథకం... ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY లేదా వీడీఎస్ 2) తీసుకువచ్చింది. ఇది పరిమిత స్థాయిలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు పసిడి క్షమాభిక్ష పథకంతో కేంద్రం ముందుకు వచ్చినట్లుగా కనిపించినట్లుగా కూడా ప్రచారం సాగింది. కానీ కేంద్రం ఈ వార్తలు కొట్టి పారేయడం గమనార్హం.
ఇలాంటి వాటికి లెక్కలు చెప్పడం కష్టం
గోల్డ్ ఆమ్నెస్టీ స్కీం తీసుకువస్తే అమలు సాధ్యమేనా అనే చర్చ కూడా సాగుతోంది. పథకం అమలు అంత సులభం ఏమీ కాదనేది నిపుణుల వాదన. మన దేశంలో చాలామంది వద్ద బంగారం తరతరాలుగా వారసత్వంగా చేతులు మారుతోంది. వాటికి ఇప్పుడు లెక్కలు చెప్పడం అసాధ్యమనేది తొలి వాదన. ఇక ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. వాటికి లెక్కలు దొరకవు. చాలామంది వాయిదా పద్ధతుల్లో చిన్న చిన్న దుకాణాల్లో ఇంట్లో కూడబెట్టిన డబ్బుతో ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
అనవసర ఆందోళనలు...
ఒకవేళ బంగారాన్ని వెల్లడించి పన్ను కట్టినా అధికారుల నుంచి వేధింపులు ఉండవచ్చుననే భయాలు ఉంటాయి. ప్రభుత్వం ఇలాంటి పథకం తీసుకు వస్తే ప్రజల్లో అనవసరమైన ఆందోళనలు తలెత్తుతాయని, ముఖ్యంగా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తాయని అంటున్నారు.
ఆలోచన మంచిదే కానీ అమలు కష్టం
గోల్డ్ ఆమ్నెస్టీ స్కీం ఆలోచన చాలా మంచిదని, కానీ దీనిని అమలు చేయడం మాత్రం చాలా కష్టసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు క్రమంగా బంగారం సేకరించిన సందర్భాలు, వారసత్వంగా వచ్చిన బంగారం, బహుమతుల రూపాల్లో వచ్చినవి ఉంటాయని కాబట్టి వాటికి లెక్కలు చూపించమంటే కష్టమవుతుందని చెబుతున్నారు.
నోట్ల రద్దు... గోల్డ్ ఆమ్నెస్టీ స్కీం..
నల్లధనం రూపుమాపే మంచి ఉద్దేశ్యంలో భాగంగా 2016లో ప్రధాని మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. రద్దు చేసే నాటికి రూ.15.41 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణిలో ఉండగా, రూ.15.31 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. అంటే 99 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. దీనికి కిందిస్థాయి నుంచి అవినీతికి సహకరించడమే కారణం. దీంతో మంచి ఉద్దేశ్యంతో తీసుకున్న ఓ నిర్ణయం ఫెయిల్ కావడానికి అధికారులు ప్రధానంగా కారణం అయ్యారు. ఇలాంటి సమయంలో గోల్డ్ ఆమ్నెస్టీ స్కీం తీసుకువస్తే అమలు కష్టమే అంటున్నారు.