Go First: DGCA వద్దకు గో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లీజుదారులు.. మొత్తం 55లో 45 విమానాలను..
Go First: నగదు కొతర వల్ల ఎయిర్ లైన్స్ సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ విమానయాన పరిశ్రమ నుంచి ఈ కంపెనీ తప్పుకుంటే ఆ స్లాట్లను దక్కించుకోవడానికీ పోటీ మొదలైపోయింది. అయితే గో ఫస్ట్ వ్యవహారంపై ప్రముఖ వార్తా సంస్థ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.
గో ఫస్ట్ పై నీలి నీడలు కమ్మకున్న ప్రస్తుత తరుణంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకు చెందిన విమానాల అద్దెదారులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ని సంప్రదించారు. ఈ ఎయిర్ లైన్స్ సంస్థకు మొత్తం 55 విమానాలు ఉన్నాయి. కాగా వాటిలో 45 ప్లేన్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అభ్యర్థించినట్లు DGCA వెల్లడించింది.
టిక్కెట్ల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని విమానయాన సంస్థను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ఆదేశించింది. 13 విమానాల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని లీజు దారులు సోమవారం కోరారు. అయితే స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియపై NCLT ఇంకా తన తీర్పును వెలువరించలేదు. ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ రామలింగం సుధాకర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ ముందు ఈ వ్యవహారం విచారణకు రానుంది.
సాధ్యమైనంత త్వరగా తమ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని NCLT ని గో ఫస్ట్ అభ్యర్థించింది. ఈ మేరకు బెంచ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేకాక తన ఆర్థిక బాధ్యతలపైనా మధ్యంతర మారటోరియం కోరుతూ విమానయాన సంస్థ వేసిన పిటిషన్ పై బెంచ్ నిర్ణయం తీసుకోబోతుంది.